
హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకోవడంతో నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో మిడిల్ స్టంప్ విరిగిపోయి ఉంది. ఆ ఫోటోను పోస్టు చేసిన బుమ్రా "ది ఎండ్... #ForTheSessionAndTheStumps 🔥🔥" అంటూ ట్వీట్ చేశాడు.
బుమ్రా చేసిన ట్విట్పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నాడు. "బుమ్రాకు సుస్వాగతం, న్యూజిలాండ్ సిరీస్లో నిన్ను చూడటానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాం" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... మరొక నెటిజన్ "బూమ్ బూమ్ బుమ్రా.. మిడిల్ స్టంప్నే లక్ష్యంగా చేసుకొని సాధన చేస్తున్నావు" అని కామెంట్ పెట్టాడు.
వెన్నునొప్పి గాయంతో బుమ్రా స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లకు దూరమయ్యాడు. బుమ్రా వెన్ను భాగంలోని ఎముక కొద్దిగా చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే మేల్కొన్న బీసీసీఐ అతడికి మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసింది. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాతో సిరిస్లకు బుమ్రాను ఎంపిక చేయలేదు.
వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్ సిరీస్కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయానికి కారణం అతని భిన్నమైన బౌలింగ్ యాక్షనేనని మాజీలు అంటున్నారు. బుమ్రాది కష్టమైన యాక్షన్ అని గతంలో తేల్చిన కొందరు మాజీ క్రికెటర్లు.. ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడంటూ తేల్చేశారు.
కానీ, బుమ్రా ఆ విమర్శల్ని పట్టించుకోకపోవడం విశేషం. టీమిండియా తరుపున ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103, 42 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.