హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్తో ముగిసిన మూడు వన్డేల సిరిస్ను 2-1తో కైవసం చేసుకోవడంలో భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించాడని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక, బుమ్రా కివీస్ను 331 పరుగులకే కట్టడి చేయడంలో చివరి ఓవర్ ఎంతో కీలకమని అన్నాడు.

నిజానికి మూడో వన్డేలో తామంతా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 'మనకు అత్యుత్తమ డెత్ బౌలర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాతో ముగిసిన సిరిస్లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. మ్యాచ్ విజయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉంటారు' అని భువీ, బుమ్రాలపై ప్రశంసల వర్షం కురిపించాడు.
'నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఈ వికెట్ పై ఏమాత్రం కష్టం కాదు. మరొకవైపు న్యూజిలాండ్ కూడా మంచి దూకుడుగా ఆడుతుంది. ఆ తరుణంలో మ్యాచ్ ను బూమ్రా, భువనేశ్వర్ లు నిలబెట్టారు. కివీస్ ను కట్టడి చేసి మళ్లీ గేమ్ ను మావైపుకి తీసుకొచ్చారు' అని రోహిత్ శర్మ అన్నాడు.
ఎంత ఒత్తడిలో ఉన్నప్పటికీ.. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి తొందరగానే బయట పడటం టీమిండియా ప్రత్యేకత అని రోహిత్ శర్మ తెలిపాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో వీరిద్దరూ 28 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మూడో వన్డేలో 147 పరుగులతో తన కెరీర్లో 15వ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.