టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్ను అందుకున్న తొలి బౌలర్గా బుమ్రా చరిత్రకెక్కాడు. అంతేగాక టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ర్యాంక్ను సాధించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వైజాగ్ టెస్టులో బుమ్రా తొమ్మిది వికెట్లతో సత్తాచాటిన విషయం తెలిసిందే. దీంతో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలుకొట్టాడు.టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన భారత నాలుగో బౌలర్గా బుమ్రా ఘనత సాధించాడు. బుమ్రా కంటే ముందు టీమిండియా నుంచి ముగ్గురు స్పిన్నర్లు టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ బేడీ ఈ ఘనత సాధించారు.

గతంలో వన్డే, టీ20 ఫార్మాట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న బుమ్రా టెస్టు ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంక్ను అందుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు టాప్ ర్యాంక్కు బుమ్రా చేరడంతో రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఉన్నాడు.
అయితే మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్ను అందుకున్న రెండో ఏషియన్ ప్లేయర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గతంలోనే విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.
మరోవైపు వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన యశస్వీ జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్కు చేరుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత్ తరఫున విరాట్ కోహ్లి టాప్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లి ఓ ర్యాంక్ను కోల్పోయి ఏడో స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్, స్మిత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టెస్టు ఆల్రౌండర్ జాబితాలో తొలి రెండు స్థానాల్లో మన ప్లేయర్లే ఉన్నారు. రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్-2లో ఉన్నారు.