గత కొన్ని నెలలుగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు క్లిష్టపరిస్థితులు ఎదురవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ను వదిలి ముంబై ఇండియన్స్కు హార్దిక్ తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ ముంబై జట్టు పగ్గాలను అందుకోవడాన్ని రోహిత్, ముంబై ఫ్రాంచైజీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. స్టేడియంలో, బయటా హార్దిక్ను హేళన చేశారు.
అవన్నీ భరిస్తూ టీ20 వరల్డ్ కప్లో బరిలోకి దిగిన హార్దిక్ భారత్ను విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయనే తరుణంలో హార్దిక్కు మరోసారి బ్యాడ్ టైమ్ మొదలైంది. టీమిండియా టీ20 పగ్గాలను హార్దిక్కు బదులుగా సెలక్టర్లు సూర్యకుమార్ యాదవ్కు ఇచ్చారు. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ఆల్రౌండర్కు అలజడి ఏర్పడింది. తన భార్య నటాషాతో విడిపోతున్నట్లు హార్దిక్ ప్రకటించాడు.

అయితే ముంబై ఇండియన్స్-టీ20 వరల్డ్ కప్ విజయం మధ్య హార్దిక్ ఎదుర్కొన్న సంఘటనల గురించి స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడాడు. ''భావోద్వేగాలు చూపించే దేశంలో మనం ఉన్నాం. అభిమానుల ఎమోషన్ను అర్థం చేసుకోగలం. అయితే ప్లేయర్లూ ఎమోషనల్ అవుతారు. మీ సొంత అభిమానులు సరిగా మాట్లాడకపోతే అది ప్రభావం చూపుతుంది. అయినా తలఎత్తుకుని ముందుకు సాగాలి. మన ఆటపై దృష్టి సారించాలి. కానీ అది అంత సులువు కాదు. వాళ్ల అరుపులు మనకు వినిపిస్తుంటాయి''
''జట్టుగా దీన్ని మేం సహించం. ఓ టీమ్గా హార్దిక్కు అండగా ఉన్నాం. అతనితో మాట్లాడాం. అయితే కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. కానీ టీ20 వరల్డ్ కప్ విజయానంతరం కథ మారిపోయింది. ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు. ఓడితే మళ్లీ విమర్శలు వస్తాయి. ఓ ఆటగాడి జీవితం ఇలానే ఉంటుంది. అత్యుత్తమ ప్లేయర్లు కూడా ఈ దశను చూస్తారు. జట్టుగా మేం ఎవరిని ఒంటరిగా వదిలిపెట్టం. ఒకరినొకరం అండగా ఉంటాం. హార్దిక్తో కలిసి ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడాను. మేం కలిసి ఉన్నాం. అతనికి అవసరమైతే తప్పక సాయం చేస్తాం'' అని బుమ్రా పేర్కొన్నాడు.