T20 World Cup 2026: పంజాబ్ వీధుల నుంచి ఇటలీ జాతీయ జట్టు వరకు సాగిన జస్ప్రీత్ సింగ్ ప్రయాణం నిజంగా ఓ సినిమాను తలపిస్తుంది. కటిక పేదరికం, వలస కష్టాలు, ఉపాధి విదేశాల్లో డ్రైవర్గా పనిచేసిన ఓ సామాన్యుడు.. ఈరోజు ప్రపంచకప్ వేదికపై గర్జించడం వెనుక ఉన్న స్ఫూర్తిదాయక గాథ ఇది.
వలస కష్టాలు.. మరోవైపు మక్కువ
జస్రీత్ సింగ్ తన 10వ ఏటనే తల్లిదండ్రులతో కలిసి పంజాబ్లోని ఫగవాడను విడిచిపెట్టాడు. మెరుగైన ఉపాధి కోసం అతడి కుటుంబం ఇటలీలోని బర్గామో నగరానికి వలస వెళ్లింది. కొత్త దేశంలో బతకడానికి జస్రీత్ తండ్రి తీర్థ్ సింగ్, తల్లి జస్వీర్ కౌర్ ఓ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేశారు. భాష తెలియదు, సంస్కృతి కొత్త.. అయినప్పటికీ జస్ప్రీత్ సింగ్ తన మాతృభాషను, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను మాత్రం వదులుకోలేదు. ఇటలీలో అసలు క్రికెట్ మైదానాలే లేని సమయంలో కూడా జస్ప్రీత్ సింగ్ పంజాబ్ వీధుల్లో ఆడిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఏదో ఒకరోజు పెద్ద క్రికెటర్ కావాలని కలలు కనేవాడు.

ఇంగ్లాండ్లో ఊబర్ డ్రైవర్గా.. క్రికెట్ కోసం తపన
ఇటలీలో క్రికెట్ నేర్చుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని గ్రహించిన జస్ప్రీత్ సింగ్ .. స్థానిక గురుద్వారాలో కలిసిన కొంతమంది ప్రవాస భారతీయుల సలహా తీసుకున్నాడు. క్రికెట్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి జస్రీత్ ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వెళ్లాడు. అక్కడ ఖర్చుల కోసం పగలు ఉబెర్ డ్రైవర్గా కారు నడుపుతూ.. దొరికిన సమయంలో టర్ఫ్ వికెట్లపై ప్రాక్టీస్ చేసేవాడు. డ్రైవింగ్ వృత్తి వల్ల అతనికి ప్రాక్టీస్ సమయాన్ని సర్దుబాటు చేసుకోవడం సులభమైంది. ఆ పట్టుదలే అతన్ని బర్మింగ్హామ్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రీమియర్ లీగ్లో రాణించేలా చేసింది.
ఇటలీ జట్టులో స్థానం.. ప్రపంచకప్ స్వప్నం సాకారం
జస్రీత్ కష్టానికి 2019లో ఫలితం దక్కింది. నార్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా జస్ప్రీత్ సింగ్ ఇటలీ జాతీయ జట్టులోకి ఫాస్ట్ బౌలర్గా ఎంపికయ్యాడు. 2024 ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఐర్లాండ్ చేతిలో తృటిలో అవకాశం కోల్పోయినప్పటికీ.. జస్ప్రీత్ నిరాశ చెందలేదు. తన జట్టును మరింత కఠినంగా సిద్ధం చేసి, జూన్ 2025లో జరిగిన యూరోపియన్ రీజినల్ క్వాలిఫైయర్స్లో ఇటలీని అగ్రస్థానంలో నిలిపి, 2026 టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించేలా చేశాడు. "మేము ఇక్కడ కేవలం ఆటను చూడటానికి రాలేదు.. గెలవడానికి వచ్చాం" అని అతను ఇప్పుడు ధీమాగా చెబుతున్నాడు.
సొంత గడ్డపై దిగ్గజాల అడుగుజాడల్లో..
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న ఈ ప్రపంచకప్ జస్ప్రీత్ సింగ్కు ఓ భావోద్వేగపూరితమైన ప్రయాణం. చిన్నప్పుడు టీవీలో చూసిన చిదంబరం స్టేడియం, ఈడెన్ గార్డెన్స్, వాంఖడే వంటి చారిత్రక మైదానాల్లో స్వయంగా ఆడటం తన పూర్వజన్మ సుకృతమని జస్ప్రీత్ సింగ్ భావిస్తున్నాడు. కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ధోనీ, కోహ్లీ వంటి మహామహులు ఆడిన గడ్డపై, ఒక ఉబెర్ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి ఆడటం తన జీవితంలో అతిపెద్ద విజయమని జస్ప్రీత్ గర్వంగా చెబుతున్నాడు.