లండన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్లు రంజుగా సాగుతున్న దశలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు గాయాల బారిన పడింది. గాయపడ్డ జట్టు డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఇంకా కోలుకోలేదు. ఆయన కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని టీమ్ ఫిజియోథెరపిస్ట్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో- మంగళవారం ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్కు సైతం జేసన్ రాయ్ దూరం అయ్యాడు. ఈ వార్త ఆస్ట్రేలియాకు ఊరట కలిగిస్తోండగా.. ఇంగ్లండ్ జట్టును ఆందోళనలో పడేసింది.
వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా జేసన్ రాయ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో బంతి కోసం పరుగెత్తిన జేసన్ రాయ్కు కాలి కండరాలు పట్టేశాయి. దీనితో అప్పటికప్పుడు గ్రౌండ్ను వదిలి వెళ్లాడు. అనంతరం వరుసగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో విఫలం అవుతూ వచ్చాడు. ఇందులో భాగంగా.. పరుగెత్తుతున్న సమయంలో కాలి కండరాల్లో నొప్పి కలుగుతోందని ఫిజియోథెరఫిస్ట్ వెల్లడించారు.
నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ ఇదే సమస్య ఉత్పన్నమౌతున్నట్లు తెలుస్తోంది. కాలి కండరాలు పట్టేయడం, పరుగెత్తుతున్న సమయంలో కండరాల్లో నొప్పి చోటు చేసుకోవడం వల్ల ఆయనకు విశ్రాంతి ఇచ్చారు. ఈ కారణంతోనే మొన్నటి శ్రీలంకతో మ్యాచ్కు కూడా జేసన్ రాయ్ దూరం అయ్యాడు. ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ప్రస్తుతం జేసన్ రాయ్ స్థానంలో జేమ్స్ విన్సీ ఓపెనర్గా ఆడుతున్నాడు. బెయిర్స్టోతో కలిసి ఇన్నింగ్ను ఆరంభిస్తున్నాడు.
నిన్న విరాట్ కోహ్లీ, నేడు న్యూజీలాండ్ టీమ్: భారీ జరిమానా
ఒక్క మ్యాచ్ కోసం విశ్రాంతి తీసుకుంటే ఆయన కాలి కండరాలు సాధారణ స్థితికి వస్తాయని తాము ఆశించామని, దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఇంగ్లండ్ జట్టు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ చెప్పారు. ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్కు జేసన్ రాయ్ దూరం కావడం తమకు పెద్ద లోటు అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ- జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని అన్నారు. బెయిర్స్టోతో కలిసి జేమ్స్ విన్సీ ఇన్నింగ్ ఆరంభిస్తారని చెప్పారు. విన్సీ బ్యాటింగ్పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తనదైన రోజున అతను చెలరేగిపోయి ఆడతాడరని ధీమా వ్యక్తం చేశారు.