
సిడ్నీ: ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్పై పోరాటం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16 వేలు దాటగా.. బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్ఓ సూచించిన జాగ్రత్తలను అన్ని దేశాలు పాటిస్తున్నాయి. విదేశీ ప్రయాణం చేసి స్వదేశానికి వచ్చిన వారిని 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియామాజీ పేసర్ జాసన్ గిలెస్పీ కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్ళాడు.
ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన గిలెస్పీ 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలోఉంటానని పేర్కొన్నాడు. గిలెస్పీ ఇంగ్లండ్ కౌంటీ జట్టు ఎసెక్స్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. విదేశీ ప్రయాణం వల్ల స్వీయ నిర్భందంలో ఉంటున్నట్లు గిలెస్పీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకోవాలని కౌంటీ యాజమాన్యంతో మాట్లాడా. ప్రస్తుతం ఆసీస్కు చేరుకున్నా. 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటా. కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి. కరోనాను అడ్డుకునేందుకు ప్రస్తుతం మనకు ఉన్న ఏకైక అవకాశం ఇదొక్కటే' అని గిలెస్పీ అన్నాడు.
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 28 వరకు ప్రొఫెషనల్ క్రికెట్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొత్త సీజన్ ఆలస్యం కానుంది. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), ఫస్ట్ క్లాస్ కౌంటీలు, ప్రొఫెషనల్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ)లతో జరిగిన సమావేశంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త సీజన్ను ఏడు వారాలు వాయిదా వేయడం సమంజసమని పేర్కొంది. ఈ క్రమంలోనే గిలెస్పీ ఇంటికి చేరుకున్నాడు.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా కొవిడ్-19 నివారణ చర్యలు చేపట్టింది. దుబాయ్లోని తమ ప్రధాన కార్యాలయాన్ని మూసేసి అధికారులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా సూచించింది. దీంతో ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, సీఈఓ మను సహానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాల్లో పాల్గొనాలనుకుంటున్నారు.