
హైదరాబాద్: నాలుగో టెస్టులో భారత్తో తలపడే ఇంగ్లాండ్ జట్టుని సెలక్టర్లు గురువారం ప్రకటించారు. నాలుగో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో స్థానికి ఆటగాడు జేమ్స్ విన్సీ చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఆగస్టు 30 నుంచి సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో జేమ్స్ విన్సీ ఎంపికకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మూడో టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఫిట్గానే ఉన్నట్లు జాతీయ సెలక్టర్ ఎడ్ స్మిత్ తెలిపాడు. జానీ బెయిర్ స్టో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు.
అయితే, ఏదైనా కారణం చేత బెయిర్ స్టో నాలుగో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఆడించేందుకు జేమ్స్ విన్సీని ఎంపిక చేశామని పేర్కొన్నాడు. స్పెక్సేవర్స్ కౌంటీ ఛాంపియన్షిప్లో హాంఫ్షైర్ జట్టు తరుపున ఆడుతున్న జేమ్స్ విన్సీ 56.46 యావరేజితో 847 పరుగులు నమోదు చేశాడు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇప్పటివరకు మూడు టెస్టులు పూర్తయ్యాయి. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగే అవకాశముంది.
మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్-3లో మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.
ఇంగ్లాండ్ టీమ్: జో రూట్(కెప్టెన్), మెయిన్ అలీ, ఆండర్సన్, జానీ బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాడ్, అలెస్టర్ కుక్, శామ్ కర్రన్, కీటన్ జెన్నింగ్స్, ఒలీ పోప్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్వోక్స్, అదిల్ రషీద్, జేమ్స్ విన్సీ.