
లండన్: ఇంగ్లండ్ జట్టు పేసర్ ఒలీ రాబిన్సన్కు అండగా ఉందని, ఆటగాళ్లు అతడిని అర్థం చేసుకొని క్షమించారని ఆ టీమ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. అతడు ఇప్పుడు చాలా బాధపడుతున్నాడని, పూర్తిగా మారిపోయాడని మేమంతా నమ్ముతున్నామని పేర్కొన్నాడు. 2012-13లో యుక్తవయసులో ఉండగా రాబిన్సన్ ట్విటర్లో జాతి విద్వేష, లైంగిక సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తాజాగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతవారమే న్యూజిలాండ్తో తొలి అంతర్జాతీయ టెస్టు రాబిన్సన్.. ఒక్క మ్యాచ్తోనే కెరీర్కు ముగింపు పలికాడు.
సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జేమ్స్ అండర్సన్ మాట్లాడాడు. ఒలీ రాబిన్సన్ను ఇంగ్లండ్ టీమ్ క్షమించిందా లేక ఎవరైనా ఆటగాళ్లు ఇంకా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ' రాబిన్సన్ మా అందరి ముందూ నిలబడి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. దాంతో అతడెంత నిజాయతీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడతడు చాలా బాధపడుతున్నాడు. పూర్తిగా మారిపోయాడని మేమంతా నమ్ముతున్నాం. 2013 నుంచి రాబిన్సన్ ఎంతో పరిణతి చెందాడు. ఇప్పుడతడికి జట్టు నుంచి పూర్తి మద్దతు దొరికింది' అని జిమ్మీ అన్నాడు.
న్యూజిలాండ్తో తొలి టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన ఒలీ రాబిన్సన్ తాను 18 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు అలా చేశానని చెప్పాడు. 'నేను అలాంటి చెడ్డవాడిని కాదు. నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా. అలాంటి కామెంట్లు చేయడం పట్ల సిగ్గుపడుతున్నా. అప్పుడు నేను ఏం చేస్తున్నాననేదానిపై స్పష్టత లేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాను. ఏదేమైనా అది క్షమించరానిది. అప్పటి నుంచి నేను ఎంతో పరిణతి చెందాను. అప్పుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా' అని రాబిన్సన్ తెలిపాడు. ఈ క్షమాపణలపై సంతృప్తి చెందని ఈసీబీ.. కివీస్తో తొలి టెస్టు పూర్తి అయిన వెంటనే అతడిని సస్పెండ్ చేసింది.
ఒలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. 'కొన్నేళ్ల క్రితం రాబిన్సన్ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఏం చేశాడో నేను అర్థం చేసుకోగలను. అయితే, అతడు టెస్టు క్రికెట్లో అదిరిపోయే అరంగేట్రం చేసిన వెంటనే ఇలా జరగడం విచారకరం. అందుకు మనసారా బాధపడుతున్నా. ఈ సోషల్మీడియా యుగంలో భవిష్యత్ ఎలా ఉంటుందనేదానికి ఈ సస్పెన్షన్ ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు.