హైదరాబాద్: లార్డ్స్ వేదికగా వెస్టిండిస్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రికార్డు నెలకొల్పాడు.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ను బౌల్డ్ చేసి అండర్సన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 129 టెస్టుల్లో ఆండర్సన్ ఈ ఘనత సాధించడం విశేషం. అంతకాదు అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు.

పేసర్లలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ (800) అగ్రస్ధానంలో ఉండగా, ఆ తర్వాతి స్ధానాల్లో షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619), మెక్గ్రాత్ (563), వాల్ష్ (519)లు అతనికంటే ముందున్నారు.
ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టెస్టులో కూడా ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. రెండో రోజుకే మ్యాచ్లో 23 వికెట్లు పడిపోయాయి. ఓవర్నైట్ స్కోరు 46/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 194 పరుగులకు ఆలౌటైంది.
దీంతో తొలి ఇన్నింగ్స్లో వెస్టిండిస్పై 71 పరుగుల ఆధిక్యం లభించింది. స్టోక్స్ (60) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. విండిస్ బౌలర్లలో రోచ్ 5, జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండిస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
షై హోప్ (35), చేజ్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు వెస్టిండిస్ తన తొలి ఇన్నింగ్స్లో 123 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.