తన ఆఖరి మ్యాచ్లో స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ అందుకోని రికార్డులు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వేల బంతులు వేసిన తొలి పేసర్గా రికార్డులకెక్కాడు. అంతేగాక టెస్టుల్లో 40వేల బంతులు విసిరిన బౌలర్గా చరిత్రకెక్కాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఇంగ్లండ్ దిగ్గజం రికార్డులు నెలకొల్పాడు.
ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ టెస్టుతో అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకుపైగా ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు. 2002లో అరంగేట్రం చేసిన అండర్సన్ 188 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ రికార్డు అండర్సన్ (703) పేరిట ఉంది.

కాగా, తన ఆఖరి మ్యాచ్లోనూ అండర్సన్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ పడగొట్టిన అండర్సన్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. అండర్సన్తో పాటు మిగిలిన బౌలర్లు కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 41.4 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లూయిస్ (27) టాప్ స్కోరర్. గస్ అట్కిన్సన్ ఏడు వికెట్లతో సత్తాచాటాడు. అండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (76), జేమీ స్మిత్ (70), జో రూట్ (68), ఒలీ పోప్ (57), హ్యారీ బ్రూక్ (50) అర్ధశతకాలు సాధించారు. విండీస్ బౌలర్లలో సీల్స్ నాలుగు వికెట్లు, హోల్డర్, మొటియ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసేసరికి 79 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంకా 171 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించే అవకాశం ఉంది.