ఈసారి యాషెస్కు ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లండ్కు దారుణమైన ఆరంభం లభించింది. బాజ్బాల్ విధానంతో వరుస విజయాలు సాధించి కాన్ఫిడెన్స్ పెంచుకున్న ఆ జట్టుకు ఆస్ట్రేలియా పెద్ద షాకిచ్చింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి, బాజ్బాల్ అంత గొప్పదేం కాదని నిరూపించింది. ఈ క్రమంలో హెడింగ్లే వేదికగా జరిగే మూడో టెస్టుకు రెండు జట్లు రెడీ అవుతున్నాయి.
రెండో టెస్టులో బెయిర్స్టో స్టంపౌట్తో రెండు జట్ల మధ్య తెగ వాగ్వాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ టీంతో ఈ ఘటన పెద్ద నిప్పురాజేసినట్లు కనిపిస్తోంది. అందుకే తర్వాతి మ్యాచుల్లో ఎలాగైనా గెలుస్తామని ఆ టీం ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే మూడో టెస్టు ఆడే జట్టును కూడా ప్రకటించేసింది. ఈ టీంతో అందరూ ఊహించినట్లే లెజెండరీ పేసర్ను పక్కన పెట్టేసింది.

హెడింగ్లే టెస్టులో కనుక ఇంగ్లండ్ ఓడితే యాషెస్ సిరీస్ కోల్పోతుంది. గత యాషెస్ను కూడా ఆసీస్ గెలిచింది. కాబట్టి ఈసారి ఎలాగైనా గెలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్తోనే సిరీస్ ముగించేయాలని, ట్రోఫీ తమ ఖాతాలో వేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్కు ఇది వందో టెస్టు కూడా కావడం గమనార్హం.
తన కెరీర్లో కీలకమైన ఈ మ్యాచ్ను విజయంతో ముగించాలని స్మిత్ భావిస్తున్నాడు. రెండో టెస్టులో గాయపడిన స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో ఆసీస్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే కనిపిస్తోంది. అయితే యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఈ మ్యాచ్లో స్పిన్ బాధ్యతలు మోసేందుకు సిద్ధం అవుతున్నాడు. అతను ఎలా రాణిస్తాడో చూడాలి.
ఈ క్రమంలోనే మూడో టెస్టు ఆడే జట్టులో మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ను ఇంగ్లండ్ తీసుకుంది. వీరిద్దరి కోసం జేమ్స్ ఆండర్సన్, జోష్ టంగ్ను పక్కన పెట్టింది. టంగ్ చివరి టెస్టులో బాగానే రాణించిన సంగతి తెలిసిందే. మూడు కీలక వికెట్లు తీసుకున్న అతను సత్తా చాటాడు. కానీ క్రిస్ వోక్స్ కనుక జట్టులో చేరితో బ్యాటింగ్లో కూడా కొంత బలం పెరిగే అవకాశం ఉంది.

అందుకే ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే తొలి టెస్టు ఆడిన తర్వాత చేతి వేళ్ల గాయంతో రెండో టెస్టులో ఆడని మొయీన్ అలీ కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవడం గ్యారంటీగా కనిపిస్తోంది.
ఇంగ్లండ్ టీం: జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయీన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్.