
హైదరాబాద్: యాషెస్ సిరిస్లో మంగళవారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టుపై విమర్శల జోరు కొనసాగుతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డె టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
దీంతో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (103) సెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. తొలి రోజు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మెల్ బోర్న్ పిచ్ ఏ మాత్రం బౌలర్లకి సహకరించలేదని.. ఇలాంటి మ్యాచ్ని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపరంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
'నాలుగో టెస్టుని చూసేందుకు స్టేడియానికి తొలి రోజు వచ్చిన సుమారు 90,000 మంది క్రికెట్ అభిమానులు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 244/3 స్కోరుని చూసి నిరాశ చెంది ఉంటారు. ప్రేక్షకులకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టు నుంచి వారు మరింత ఆనందాన్ని కోరుకుంటారు' అని ఆండర్సన్ అన్నాడు.
'మ్యాచ్ తొలి సెషన్లో ఇంగ్లాండ్ మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయిందని నేను ఒప్పుకుంటాను. కానీ.. రెండో సెషన్ నుంచి మా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. మెల్ బోర్న్ పిచ్ నుంచి మాత్రం మాకు సహకారం లభించలేదు. నిజాయతీగా చెప్పాలంటే.. నాకు మ్యాచ్ ఆడుతున్న ఫీలింగే కలగలేదు' అని అండర్సన్ పేర్కొన్నాడు.
ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ను ఇప్పటికే 3-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.