హైదరాబాద్: తమిళవాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జల్లికట్టు ఆందోళనలు సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలను సైతం భయపెట్టాయి. జల్లికట్టు ఆందోళనలో భాగంగా భయపడిన వారిలో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండటం విశేషం.
ఇంగ్లాండ్తో చివరిదైన కోల్కతా వన్డే ముగిసిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం చెన్నైకి వచ్చాడు. ప్రస్తుతం తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఆందోళనకారులు తనని ఎక్కడ అడ్డుకుంటారోనని భయపడిన అశ్విన్ మెట్రో రైలు ఎక్కాడు.

చెన్నైలోని వెస్ట్ మంబళంలో ఉండే ఈ ఆఫ్ స్పిన్నర్ మెట్రో రైలులో ఇంటికి వెళ్లాడు. సోమవారం చెన్నై అంతా ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో చాలా మంది మెట్రో రైలులోనే ప్రయాణించారు. సోమవారం చాలా మంది సెలబ్రిటీలు మెట్రోలో ప్రయాణించారు.
రవిచంద్రన్ అశ్విన్ మెట్రోలో ఎక్కడంతో పలువురు ప్రయాణికులు అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అశ్విన్ అశోక్నగర్ మెట్రో స్టేషన్లో దిగేవరకు సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 సిరిస్కు అశ్విన్తో పాటు జడేజాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో ఆశ్విన్ చెన్నైకి వచ్చాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 26 (గురువార) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే అంతకముందు చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంతంలో ప్రశాంతంగా సాగుతున్న ఆందోళనలకు మద్దతుగా అశ్విన్ ట్విట్టర్లో మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.