
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. టోర్నీలో భాగంగా బుధవారం కెన్యాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు జాకబ్ భూల చరిత్ర సృష్టించాడు. అండర్ 19 వరల్డ్ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన కెన్యా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా జాకబ్ భూల, రవీంద్ర ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 245 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతేకాదు వీరిద్దరూ సెంచరీలు నమోదు చేశారు.
అయితే, ఇన్నింగ్స్ 35.5వ ఓవర్ వద్ద సుఖ్దీప్ సింగ్ వేసిన బంతికి రవీంద్ర (117) ఔటవ్వడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం ఇన్నింగ్స్ 46.6 ఓవర్లో భూల 180 (144 బంతుల్లో; 10 ఫోర్లు, 5సిక్సుల)పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఓ ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.
అంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు డోరోపోలాస్ 179 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇప్పుడు ఆ రికార్డుని భూల బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే భూల-రవీంద్ర సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 436 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెన్యూ 243 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.