ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న భారత్ కు గాయాల బెడద ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యాడు. చేతి వేలి గాయం కారణంగా శుభ్ మన్ గిల్ కూడా మొదటి మ్యాచ్ ఆడడం లేదు. తాజాగా స్టార్ ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి టెస్ట్ మ్యాచ్కు ముందు నెట్ సెషన్లో స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. అతను కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. ప్రాక్టీస్ సెషన్లో ఫిజియో అతనికి థెరపీ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గాయం తీవ్రత ఎంత ఉందో తెలియదు కానీ.. ఫొటోను చూస్తే అతను మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతను నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే పెర్త్ లో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్లో పాల్గొనడం సందేహాస్పదంగా మారింది. ఓపెనర్లలో ఒకడైన రోహిత్ శర్మకు కూతురు పుట్టడంతో అతను ఆటకు దూరంగా ఉన్నారు. శుభ్ మన్ గిల్ గాయం కారణంగా ఆడడం లేదు. ఇప్పుడు జైస్వాల్ కూడా గాయం కారణంగా టెస్ట్ మ్యాచ్ కు దూరం అయితే.. ఓపెనర్లుగా ఎవరు వస్తారు అనేది సందేహంగా మారింది.

జైస్వాల్ ఫిట్ గా ఉంటేనే తీసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇప్పుడు లేకపోవడంతో వాళ్ల స్థానాల్లో రాహుల్, పడిక్కల్ రానున్నట్లు తెలుస్తోంది. జైస్వాల్ ఫిట్ నెస్ సాధిస్తే అతను, రాహుల్ ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో టీమ్ మేనేజ్ మెంట్ ఏం చేస్తుందో చూడాలి. టీమిండియా మొదటి మ్యాచ్ లో సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు జట్టులో చేరనున్నాడు. అయితే జైస్వాల్ పెర్త్ టెస్ట్ మ్యాచ్లో పాల్గొనేంత ఫిట్గా ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆశలు పెట్టుకుంది. భారత తుది జట్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ ఉండే అవకాశం ఉంది.