
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు గట్టి దెబ్బతిన్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టును ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కునేమన్ బాగా దెబ్బతీశాడు. ప్రమాదకరమైన రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్, అశ్విన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు చివర్లో భారీ షాట్లు ఆడిన ఉమేష్ యాదవ్ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో తన కెరీర్లో మొదటి సారి ఐదు వికెట్ల హాల్ సాధించాడు. దీనిపై కునేమన్ మాట్లాడుతూ.. జడేజాతో జరిగిన ఫన్నీ సంభాషణను వెల్లడించాడు.
తను జడేజా, అశ్విన్ ఇద్దరికీ చాలా పెద్ద అభిమానిని అని కునేమన్ చెప్పాడు. వాళ్లు ఎలా బౌలింగ్ చేసేదీ తాను జాగ్రత్తగా గమనించానని తెలిపాడు. ముఖ్యంగా తనలాగే ఎడం చేతి వాటం స్పిన్నర్ అయిన జడేజా బౌలింగ్ను పరిశీలించానని చెప్పాడు. 'ఢిల్లీ టెస్టులో జడేజా బౌలింగ్ జాగ్రత్తగా గమనించా. ముఖ్యంగా అతను క్రీజును ఎలా వాడుకుంటాడు? ఎక్కడ పిచ్ వేస్తాడు? అని చూశా. బంతి పాత పడే కొద్దీ జడ్డూ తన లెంగ్త్ను కొంచెం తగ్గిస్తాడు. అలా చేయకుండా ఫుల్ లెంగ్త్ వేస్తే బంతి చాలా కిందకు వస్తుంది. అప్పుడు బ్యాటర్లకు దాన్ని ఆడటం సులభం అవుతుంది' అని చెప్పాడు.
రెండో టెస్టులో గమనించిన అదే విషయాన్ని తాను మూడో టెస్టులో ప్రయత్నించానని కునేమన్ చెప్పాడు. 'నా బౌలింగ్ లెంగ్త్ కూడా జడ్డూను చూసి మార్చుకున్నా. బంతి ఎక్కువ ఎత్తుగా రాని పిచ్పై నా లెంగ్త్ను తగ్గించా. ఆ ఐదారు మీటర్ల దూరంలోనే బంతులు విసిరా' అని కునేమన్ వివరించాడు. అశ్విన్, జడేజా గత కొన్నేళ్లుగా ఎలా బౌలింగ్ చేస్తూ వస్తోంది తను బాగా గమనించానని చెప్పాడు. అలాగే జడేజాతో కూడా తను మాట్లాడానని చెప్పాడు. తనకేమైనా టిప్స్ చెప్తావా? అని జడ్డూనే అడిగితే.. 'సిరీస్ అయిపోయాక కనిపించు' అని జడ్డూ అన్నాడని పేర్కొన్నాడు. తను కూడా చివరి టెస్టు తరవాతనే ఈ టిప్స్ చెప్పాలని అడిగానన్నాడు.