
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్కు మంచి అవకాశం లభించింది. అమెరికా క్రికెట్ జట్టుకు అతను హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించిన విషయం తెలిసిందే.
కర్ణాటక మాజీ ఆటగాడైన అరుణ్ కుమార్.. గత కొన్నేళ్లుగా కర్ణాటక రంజీ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అరుణ్ కోచ్గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013-14; 2014-15 సీజన్లలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ టైటిల్స్ నెగ్గి అరుదైన ట్రిపుల్ ఘనత సాధించింది. అలాగే అరుణ్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా కూడా పనిచేస్తున్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన యూఎస్ బోర్డు.. అరుణ్ను కోచ్గా నియమిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
'రిక్రూట్మెంట్లో భాగంగా మాజీ రంజీ ఆటగాడు, కోచ్ అయిన అరుణ్ కుమార్ను కోచ్గా ఎంపిక చేశాం. అతడు అమెరికా పురుషుల జట్టుకు కోచ్గా వ్యవహరిస్తాడు. ఇదే మా స్వాగతం' అని యూఎస్ఏ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ హిగ్గిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నది. పరిస్థితులు చక్కబడ్డాక ఆటల గురించి ఆలోచిస్తామని అందులో పేర్కొన్నారు.
భవిష్యత్లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్ కుమార్ తెలిపాడు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి.. తనకు వీసా మంజూరు కాగానే అమెరికాకు వెళ్తానని అరుణ్ అన్నాడు. 'ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఇప్పుడప్పుడే అమెరికు వెళ్లే స్థితి లేదు. వీసా కార్యక్రమాలు పూర్తైన తర్వాతే దాని గురించి ఆలోచించేది. స్వల్ప, దీర్ఘ కాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతా. అన్నింటికంటే ముఖ్యమైనదేంటంటే.. అమెరికాను టెస్టు క్రికెట్ ఆడే దేశంగా తీర్చిదిద్దడం. ఇదే నా ప్రధాన లక్ష్యం' అని అరుణ్ చెప్పాడు.