ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్య రాకతో ముంబై జట్టు రాకెట్లా దూసుకెళ్తుందనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్కు జట్టు పగ్గాలను అప్పగించిన సంగతి తెలిసిందే.
పదేళ్లలో అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ను కెప్టెన్గా నియమించారు. ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ముంబై కెప్టెన్సీపై రోహిత్ తొలిసారి స్పందించాడు. మాజీ ఆటగాళ్లు గిల్క్రిస్ట్, మైకేల్ వాన్తో కలిసి హాజరైన ఓ ఇంటర్వ్యూలో ముంబై జట్టు గురించి కీలక వ్యాఖ్యలు మాట్లాడాడు. హార్దిక్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ముంబై ఫ్రాంచైజీకి చురకలు అంటించాడు.

ఐపీఎల్లో ఓ జట్టును విజయపథంలో ఎలా నడిపించాలో తనకి బాగా తెలుసని రోహిత్ అన్నాడు. గత పదేళ్లలో కోచ్లు మారినప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ మారలేదని గుర్తు చేశాడు. వాంఖడే మైదానంలోని పరిస్థితులపై అపారమైన జ్ఞానం ఉందని తెలిపాడు. సీజన్ తొలి అర్ధభాగంలో వెనుకపడటం తర్వాత పుంజుకోవడం ముంబైకు అలవాటే అని హిట్మ్యాన్ చెప్పాడు.
''స్లోగా సీజన్ స్టార్ట్ చెయ్యడం, తర్వాత ఛేంజ్ చేయడం గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ స్టోరీ. గత పదేళ్లు కెప్టెన్ స్తబ్దుగా ఉన్నాను. కోచ్లు మారారు. కానీ కెప్టెన్ ఒక్కడే. నేను ఓ ఆలోచనతో మొదలుపెడతాను. జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు నా ఆలోచనతో కొనసాగాలనుకుంటాను. ఎందుకంటే ఐపీఎల్లో జట్టును సక్సెస్ఫుల్గా ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలుసు''
''ఆటగాళ్లకు కాస్త సమయం పడుతుంది. తమకు అలవాటు లేని పని చేయడానికి టైమ్ పడుతుంది. అయితే ఇదంతా ఒక్కడే చేసేది కాదు. ముంబై సపోర్ట్ స్టాఫ్ కృషి ఎంతో ఉంది. పాంటింగ్ నుంచి మార్క్ బౌచర్ వరకు అందరి సాయం ఉంది'' అని రోహిత్ తెలిపాడు. కాగా, ఇవాళ ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.