టీ20 ఫార్మాట్ జట్టులో చోటు కోల్పోవడంపై టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన నియంత్రణలో లేని విషయాలను గురించి ఆలోచించి ఆందోళన చెందనని తెలిపాడు. ఇంగ్లాండ్తో జరగనున్న టెస్టు సిరీస్పై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు శ్రేయస్ అయ్యర్ ఎంపిక కానీ విషయం తెలిసిందే.
జట్టులో తీవ్ర పోటీ ఉండటంతో శ్రేయస్ చోటు కోల్పోయాడని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. అయితే జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు ఎంపికయ్యాడు. సెలక్షన్కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడమని శ్రేయస్కు బీసీసీఐ సూచించింది. దీంతో రంజీట్రోఫీలో ఆంధ్ర జట్టుతో జరిగిన ముంబయి జట్టు తరపున బరిలోకి దిగాడు. 48 పరుగులు సాధించాడు. అయితే ఆంధ్ర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని శ్రేయస్ తెలిపాడు.

''ఆంధ్ర బౌలర్లు డిఫెన్సివ్గా బౌలింగ్ చేశారు. నా బలమైన షాట్లను ఆడకుండా బంతులు విసిరారు. అయితే షార్ట్ పిచ్ బంతులకు పరుగులు రాబట్టాను. కానీ వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కొన్ని బంతుల్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. అలా బంతుల్ని వదిలేయడం నాకు బోరింగ్గా అనిపిస్తుంటుంది. అందుకే ఆ సమయంలో షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తుంటా. ఇక ఈ మ్యాచ్ ఫిట్నెస్ కోసం ఆడాను. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తర్వాత మైదానంలో ఎక్కువసేపు ఉండటం చాలా కష్టం. ఇది ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది''
''వారి (బీసీసీఐ) సూచనలకు అనుగుణంగా మ్యాచ్ ఆడాను. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాను. నియంత్రణలో లేని విషయాల గురించి ఫోకస్ పెట్టను. ముంబై తరపున ఆడాలని, జట్టును గెలిపించాలని ఇక్కడకి వచ్చాను. ఇక ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ గురించి కాకుండా ఒక్కో మ్యాచ్ గురించి దృష్టిసారిస్తా. భారత జట్టును కూడా తొలి రెండు టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు. అందులో రాణించిన వారే చివరి మూడు టెస్టులకు ఎంపిక అవుతారని భావిస్తున్నా. జట్టులో స్థానం కోసం ఏర్పడే పోటీ అంటే నాకు చాలా ఇష్టం'' అని శ్రేయస్ అన్నాడు.
రంజీట్రోఫీలో ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ముంబయి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.