దక్షిణాఫ్రికా పర్యటనను ఘనంగా ముగించిన భారత్ మరో సమరానికి సిద్ధమైంది. జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే అఫ్గాన్ బలమైన ప్రత్యర్థి కానప్పటికీ టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అంతేగాక స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ సిరీస్పై ఆసక్తి పెరిగింది.
అయితే అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్ షిప్లో టాప్-2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. మరోవైపు సిరీస్ ప్రారంభం కాకముందే భారత్ పిచ్లపై చర్చలు మొదలయ్యాయి. టర్నింగ్ పిచ్ను కాకుండా పేస్కు అనుకూలించే పిచ్లు తయారుచేయాలని ఇంగ్లాండ్ క్రికెటర్లు, మాజీలు ఇప్పటికే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.అయితే ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా జరిగిన కేప్టౌన్ పిచ్ను క్యురేటర్ పొరపాటుగా చేశాడని SENA దేశ ఆటగాళ్లు సమర్థించుకోవడంపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

''SENA దేశాల్లో పిచ్ పరిస్థితులపై విమర్శలు వస్తే పొరపాటు జరిగిందని సాకులు చెబుతారు. అదే భారత్ క్యురేటర్లు పొడి పిచ్ను సిద్ధం చేస్తే గెలుపు కోసం కావాలని చేశారని విమర్శిస్తుంటారు. గతేడాది భారత్లో జరిగిన టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా ఆలౌట్ కాగానే ఓ ఆసీస్ మాజీ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పిచ్ విషయంలో మా సిబ్బంది అయితే కావాలని చేస్తారు.. కానీ వాళ్ల గ్రౌండ్ సిబ్బంది మాత్రం పొరపాటుగా అభివర్ణిస్తారా?''
''మరికొన్ని రోజుల్లో భారత్లో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ జట్టుకు ఇక్కడ పిచ్ విషయంలో ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ల మీడియా విమర్శలు మొదలుపెడతాయి. అయితే ఇటీవల రోహిత్ శర్మ.. భారత్లో తొలి రోజు నుంచే బంతి టర్న్ అయితే ప్రశ్నించొద్దని అన్నాడు. అలా మాట్లాడనంతవరకు విదేశీ పిచ్లపై ఆడటానికి తమకి ఇబ్బంది లేదని చెప్పాడు. కానీ రోహిత్ అసాధ్యమయ్యే విషయాన్ని అడిగాడు. ఐసీసీలో భారత్ శక్తి పెరిగినప్పటికీ కొన్ని దేశాలు ప్రత్యేక ఎజెండాతో వారికి అనుకూలంగా మార్చుకుంటున్నాయి'' అని గవాస్కర్ అన్నాడు.
దక్షిణాఫ్రికా రెండో టెస్టు ముగిసిన అనంతరం భారత్లోని స్పిన్ పిచ్లపై వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘూటుగా స్పందించిన విషయం తెలిసిందే.''కేప్ టౌన్లోని పిచ్ ఎలా కఠినంగా ప్రవర్తించిందో అందరూ చూశారు. భారత్కు వచ్చినప్పుడు అక్కడి పిచ్ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే.. ఇలాంటి పిచ్పై ఆడేందుకు మాకెలాంటి ఇబ్బంది ఉండదు.టెస్టు క్రికెట్ ఆడేందుకు మేం వచ్చాం. పరిస్థితులు సవాలుగా ఉన్నా ఎదుర్కోవాలి. కానీ భారత్లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే అప్పుడందరూ పిచ్ గురించి మాట్లాడతారు. తొలి రోజు నుంచి బంతి సీమ్ అయితే పర్వాలేదు కానీ స్పిన్కు అనుకూలిస్తూ మాత్రం ఒప్పుకోరు'' అని రోహిత్ తెలిపాడు.