IND vs PAK: టీమిండియా చేతిలో ఓటమి పాలైన తర్వాత దుబాయ్లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పాకిస్థానీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి మనస్సులు ముక్కలయ్యాయి.
నిరాశలో పాక్ అభిమానులు
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం బయట మీడియా ప్రతినిధులు పాక్ అభిమానులతో మాట్లాడినప్పుడు వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఓ యువ అభిమాని మాట్లాడుతూ, "చాలా చెత్త ఆట. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరు. బాబర్ లేడు, రిజ్వాన్ లేడు" అని అన్నాడు. మొత్తానికి, దుబాయ్లో ఆదివారం భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం పాక్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మరో అభిమాని మాట్లాడుతూ.. "చాలా చెత్త ఆట ఆడారు వీళ్లు. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ ఎటువంటి ప్రదర్శన కనిపించలేదు. ఇది ఒక హోరాహోరీగా ఉండే మ్యాచ్ అనుకున్నాం, కానీ అలా జరగలేదు. మ్యాచ్ మొదటి నుంచి ఏకపక్షంగా ఉంది" అని అన్నాడు.

"డబ్బులు వృథా చేసుకున్నాం"
సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 21న భారత్, పాకిస్తాన్ మధ్య మరో పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ చూడటానికి వస్తారా అని అడిగినప్పుడు ఒక అభిమాని మాట్లాడుతూ.. "మేము రాము. ఇంత డబ్బు ఖర్చు చేసి అబుదాబి నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ ఆటలో ఎలాంటి మజా లేదు, నెయిల్ బైటింగ్ లేదు. మ్యాచ్ భారత్ బాగా ఆడి, బాగా గెలిచింది" అని నిరుత్సాహంగా చెప్పాడు. మరో పాకిస్తానీ అభిమాని మాట్లాడుతూ, "మా జట్టు ఆట తీరు చూస్తుంటే, మ్యాచ్ మధ్యలోనే డిన్నర్ ఎక్కడ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాం. అయితే, మా జట్టు ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నాడు.
"ఎవరు బాగా ఆడితే వాళ్లే గెలుస్తారు. భారత జట్టు పాకిస్తాన్ కన్నా మెరుగ్గా ఆడింది. షాహీన్ మాత్రమే రన్స్ చేశాడు, మా జట్టులో మిగతావాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు మా జట్టు మరింత హోంవర్క్ చేయాలి" అని ఇంకొక అభిమాని అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ వివరాలు ఇలా..
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమంగా రాణించి 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది.