ఇండియన్ క్రికెట్ చరిత్రలో జూన్ 20వ తేదీ స్పెషాలిటీ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ డేట్ నాడే ఇండియా క్రికెట్ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ముగ్గురు క్రికెటర్లు ఇండియన్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. భారత క్రికెట్ను ఒక్కో మెట్టు ఎక్కించిన యోధులు ఆ ముగ్గురు క్రికెటర్లు. ఒకరేమో కెప్టెన్సీలో ఓ స్పెషల్ అగ్రెస్సివ్ మార్క్ చూపించిన దాదా కాగా.. మరొకరేమో పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో దుర్భేద్యంగా పాతుకుపోయే వాల్.. ఇంకొకరేమో 21వ శతాబ్దపు అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిలా పరిగణించే కింగ్.. ఈ ముగ్గురు ఇదే రోజు భారత టెస్ట్ క్రికెట్లోకి అడుగిడి ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఆ ముగ్గురు ఎవరో ఓ ఐడియా వచ్చే ఉంటుంది. ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ కాగా.. రెండో వ్యక్తి ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్గా వ్యహరిస్తున్న రాహుల్ ద్రవిడ్, మూడో వ్యక్తి టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.
ఈర సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా 1996 జూన్ 20వ తేదీన లార్డ్స్లో తమ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు. ఇక ఆ తర్వాత 2011 జూన్ 20వ తేదీన వెస్టిండీస్ పర్యటనలో కింగ్స్టన్ స్టేడియంలో జరిగిన టెస్ట్లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన పాదం మోపాడు. ఈ దిగ్గజ బ్యాటింగ్ త్రయంలో గంగూలీ తన తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ (131) బాదగా.. ద్రావిడ్ కూడా 95 పరుగులు చేసి మెప్పించారు. మరోవైపు విరాట్ కోహ్లీ తన తొలి టెస్ట్ మ్యాచ్లో(4, 15)తో నిరాశపరిచినా.. తర్వాత్తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు.
ఒకే తేదీన టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ ముగ్గురు.. టీమిండియా కెప్టెన్లుగా కూడా ఎనలేని క్రికెట్ సేవ చేశారు. గంగూలీ తన టెస్ట్ కెరీర్లో 113 టెస్టుల్లో 16సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7212పరుగులు చేశాడు. వన్డేల్లో 311 వన్డేల్లో 22సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11,363 పరుగులు చేశాడు. ఇక ద్రావిడ్ 164టెస్టుల్లో 36సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13,288 పరుగులు చేశాడు. 344 వన్డేల్లో 12సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలతో 10,889పరుగులు చేశాడు. వీరిద్దరి కెరీర్ తుదినాళ్లలో ఉండగా.. కోహ్లి టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఇక 101 టెస్టుల్లో 7డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 8043పరుగులు చేసిన కోహ్లీ వన్డేల్లో 260వన్డేల్లో 43 సెంచరీలు, 64హాఫ్ సెంచరీలతో 12,311పరుగులు చేశాడు.