రాయుడు స్థానంలో శంకర్:
15 మందితో కూడిన ప్రపంచకప్ భారత్ జట్టుని సెలక్టర్లు ఎంపిక చేసిన సమయంలో రాయుని ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కాగా అతని స్థానంలో విజయ్ శంకర్కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. విజయ్ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో (త్రీ డైమన్షన్స్) జట్టుకి ఉపయోగపడతాడని ఎమ్మెస్కే ప్రసాద్ అప్పడే వివరణ ఇచ్చారు.
త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చా:
ప్రపంచకప్ జట్టు ప్రకటించిన మరుసటి రోజు ఎమ్మెస్కే వివరణపై రాయుడు వ్యంగంగా ఓ ట్వీట్ చేసాడు. 'ప్రపంచకప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను' అని ట్వీట్ చేసాడు. ఇక గాయంతో ధావన్, శంకర్ టోర్నీ నుండి నిష్క్రమించినా.. రాయుడికి అవకాశం ఇవ్వకుండా పంత్, అగర్వాల్లను ఇంగ్లండ్ పంపించారు. దీంతో ఆగ్రహించిన రాయుడి రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయుడి రిటైర్మెంట్కు త్రీడీ ట్వీట్ కూడా ఓ కారణమేనని వార్తలు వచ్చాయి.
ట్వీట్ను ఎంజాయ్ చేశా:
ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు బీసీసీఐ అధికారులు హాజరయ్యారు. జట్ల సెలక్షన్ అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్ రాయుడు ట్వీట్పై స్పందించాడు. 'అంబటి రాయుడు ట్వీట్ను నేను చాలా ఎంజాయ్ చేశా. అది ఒక లవ్లీ ట్వీట్. సమయస్ఫూర్తితో కూడిన ట్వీట్ అది. రాయుడి భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.
ద్వేషం, పక్షపాతం లేదు:
'జట్టు ఎంపికలో మాకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఏ క్రికెటర్ విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేదు. రాయుడు టీ20 ప్రదర్శన ఆధారంగా వన్డేలకు ఎంపిక చేయాలనుకున్నప్పుడు విమర్శలు వచ్చాయి. అయినా అతనిని ఎంపిక చేశాం. రాయుడు ఫిట్నెస్ టెస్ట్ ఫెయిలైనప్పుడు కూడా అండగా నిలిచాం. కొన్ని కాంబినేషన్స్ నేపథ్యంలో అతన్ని ప్రపంచకప్ తుది జట్టులోకి తీసుకోలేదు. దీనికి సెలక్షన్ కమిటీ పక్షపాతంగా వ్యవహరించదనడం సరికాదు' అని ఎమ్మెస్కే అన్నారు.