హైదరాబాద్: భారత్లో మహిళల క్రికెట్కు మంచి రోజులు మొదలయ్యాయని టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. ఉమెన్ వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన మిథాలీ సేన బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్ నుంచి ముంబైకి చేరుకోగానే అభిమానులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.
అయితే గతంలో ఎన్నడూలేనంత ఆదరణ ఇప్పుడు లభించడంతో భారత మహిళల జట్టు ఎంతో సంతోషంలో మునిగి తేలుతోంది. ముంబైకి చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిథాలీ మాట్లాడుతూ 'మహిళల క్రికెట్కు ఇప్పుడే మంచి రోజులు మొదలయ్యాయి' అని చెప్పింది.

'అభిమానుల మద్దతు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలా ఘన స్వాగతం లభించడం ఇదే మొదటిసారి. 2005లో ఇలాంటి సందర్భమే చోటు చేసుకున్నా, ఇంతటి రెస్పాన్స్ మాత్రం రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇది కేవలం ఆరంభం మాత్రమే' అని మిథాలీ రాజ్ చెప్పింది.
బీసీసీఐ ప్రమోషన్తో పాటు భారత మహిళల జట్టు మ్యాచ్లను ప్రసారం చేసేందుకు ఇదే సరైన సమయమని మిథాలీ అభిప్రాయపడింది. 2013 వరల్డ్కప్లో విఫలమైన తర్వాత జట్టు చాలా కఠినంగా శ్రమించిందని, దాని ఫలితమే ఈ వరల్డ్కప్లో కనిపించిందని ఆమె తెలిపింది.
టీ20 వరల్డ్కప్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తామని మిథాలీ స్పష్టం చేసింది. ఇక మహిళలకు ఐపీఎల్పై మిథాలీ మరోసారి స్పందించింది. గత కొన్నాళ్లుగా మహిళల ఐపీఎల్ గురించి బీసీసీఐని కోరుతున్నామని, దానికి ఇదే సరైన సమయమని మిథాలీ చెప్పుకొచ్చింది.
వివిధ దేశాల్లోని మహిళా క్రికెటర్లు వారి ప్రమాణాలను మెరుగుపరిచుకుంటున్నారని, ఐపీఎల్ ద్వారా మన దేశంలోని దేశవాళీ క్రికెటర్లు వెలుగులోకి వస్తారని మిథాలీ అభిప్రాయపడింది. ఐపీఎల్ లాంటి లీగ్ ఉంటే చాలా మంది ప్లేయర్స్కు తమను తాము నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని చెప్పింది.
అయితే మహిళల ఐపీఎల్ నిర్వహించడం అనేది బీసీసీఐ ఇష్టమని మిథాలీ చెప్పింది. ఇక లార్డ్స్లో ఆడటం అనేది ప్రతి క్రికెటర్ కల అని, అక్కడ ఫైనల్ ఆడటంతో తన కల నిజమైందని సీనియర్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి ఈ సందర్భంగా స్పష్టం చేసింది.