
హైదరాబాద్: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ తడబడుతోంది. లక్ష్యం 287.చాలా తక్కువే అయినా విజయాన్ని సొంతం చేసుకోవడం అంత సులువేమీ కాదు. భారత పరుగుల యంత్రం కోహ్లీ మైదానంలో ఉన్నంతసేపూ ఎంతటి లక్ష్యమైనా చిన్నగానే కనిపిస్తోంది. అదే కోహ్లీ ఔటైతే ఇక భారత్ పనైపోయిందని అందరూ అనుకుంటారు. తాజాగా భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా ఇలాగే ఫీలయ్యాడు. కోహ్లీ పనైపోయింది. టీమిండియా పని అయిపోయింది. అని వ్యాఖ్యానించాడు. ఇక ఇండియా పనైపోయిందని ట్విటర్లో పేర్కొన్నాడు.
సెంచూరియన్లో జరుగుతోన్న రెండో టెస్టులో 287 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. 15.6 వద్ద ఎంగిడి బౌలింగ్లో కోహ్లీ(5) ఎల్బీ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ(153, 217 బంతుల్లో)పై పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఇక ఈ టెస్టులోనూ భారత్ గెలవడం కష్టమే అని భావించారు.
ఇదే విషయాన్ని ఎంతో మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులతో పంచుకున్నారు. భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా తన ఫీలింగ్ను ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 'అనుకోకుండా అంతా అయిపోయింది. కోహ్లీ ఔటయ్యాడు, ఇక ఇండియా పనైపోయింది' అని పేర్కొన్నాడు. అభిమానులు కూడా సెంచూరియన్ టెస్టులో భారత్ గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు.
సొంతగడ్డపై ప్రత్యర్థులను గడగడలాడించిన కోహ్లీ సేన విదేశీ గడ్డపై డీలా పడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంచూరియన్ టెస్టులో భారత్ నెగ్గాలంటే ఇంకా 252 పరుగులు చేయాలి. చేతిలో ఉన్న ఏడు వికెట్లతో భారత్ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి.