
హైదరాబాద్: క్రికెట్ ఆటలో ఫీల్డ్ అంపైర్లు పొరపాట్లు చేయడం సహజమే. ఎల్బీడబ్ల్యు (లెగ్ బిఫోర్ వికెట్), రనౌట్ లేదా క్యాచ్ విషయంలో పొరబడి.. వారు అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పటివరకు ఏ అంపైర్ కూడా వైడ్ బాల్ విషయంలో పొరబడలేదు. తాజాగా వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో ఆ పొరపాటు జరిగింది. భారీ వైడ్ను కూడా ఫీల్డ్ అంపైర్ ఇవ్వలేదు. దీంతో అభిమానులతో పాటు మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా స్థానిక అంపైర్లనే ఆయా బోర్డులు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.
2 టెస్టులు, 5 టీ20 మ్యాచ్ల సిరీస్ల కోసం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య చివరి టీ20 జరిగింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19 ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్.. ముల్దర్కు షార్ట్ బాల్ను సంధించాడు. బంతి బ్యాట్స్మన్కు దూరంలో.. చాలా ఎత్తులో వెళ్లింది. దానిని షాట్ ఆడేందుకు ముల్దర్ విఫలయత్నం చేశాడు. కానీ కనెక్ట్ కాలేదు. నిజానికి అది వైడ్బాల్. కానీ అంపైర్లు మాత్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ముల్దర్, మిల్లర్ షాక్ అయ్యారు. ఇక కామెంటేటర్స్ అయితే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ వైడ్కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. బంతి వైడ్ అని క్లియర్గా కనిపిస్తున్నా అంపైర్లు స్పందించకపోవడం ఏంటని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నించారు. ఇక దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాళ్లు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ అసహనం వ్యక్తం చేశారు. 'ఈ భూమి మీద అది ఎలా వైడ్గా పరిగణించరో చెప్పగలరా? అని స్టెయిన్ కామెంట్ చేశాడు. 'షాకర్' అంటూ డివిలియర్స్ మద్దుతు పలికాడు. 'ఇది నిజంగా చెత్త అంపైరింగ్', 'దేవుడా.. అది వైడ్ కాదా?' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.
వెస్టిండీస్తో ముగిసిన చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో నెగ్గి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్లో మార్క్మ్ (70), డికాక్ (60) అర్ధ శతకాలతో రాణించడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఎవిన్ లూయిస్ (52) మినహా అందరూ విఫలమవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3.. రబాడ, మల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.