లండన్: అనిశ్చితికి మారుపేరు పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఎప్పుడెలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. కనీసం అంచనా కూడా వేయలేరు. ఈ విషయం మరోసారి ప్రస్తుత ప్రపంచకప్ సందర్భంగా నిరూపితమైంది. మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన భారత క్రికెట్ జట్టుతో దారుణంగా ఓటమిని చవి చూసింది పాకిస్తాన్ జట్టు. తన తరువాతి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంది. భారత్తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ల ఆటతీరును చూసిన తరువాత ఆ జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.
సంజయ్ మంజ్రేకర్పై బీమర్: ఏకంగా ఐసీసీకి ఫిర్యాదు!
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ను పాకిస్తాన్ ఎలా ఆడిందో చూసి, ముక్కున వేలేసుకున్నారు. భారత్తో ఆడిన జట్టు ఇదేనా? అని అనిపించేలా చెలరేగిపోయింది సర్ఫరాజ్ అహ్మద్ సేన. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి, సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అక్కడితో ఆగలేదు. తాజాగా- న్యూజీలాండ్నూ మట్టికరిపించింది. ప్రస్తుత ప్రపంచకప్లో ఓటమి అనేదే లేకుండా సాగుతున్న బ్లాక్ క్యాప్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. అసాధారణంగా రాణించింది. భారత్పై విఫలమైన ఆటగాళ్లందరూ ఈ రెండు మ్యాచుల్లో తమ స్థాయికి మించి ప్రదర్శన చేశారు. గొప్పగా ఆడారు.
ఆ జట్టు ఆటతీరు ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్ రికీ పాంటింగ్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. పాకిస్తాన్ ఆట శైలికి అద్దం పట్టాయి. అందరి మనసుల్లో ఉన్న మాటనే ఆయన వెల్లడించినట్టయింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కొత్తగా శతృవులు అవసరం లేదని, తనకు తానే శతృవు అని రికీ పాంటింగ్ చెప్పారు. బలహీనమైన జట్లపై దారుణంగా ఓడిపోయే నైజం ఆ జట్టుకు ఉందని, అలాగే ఎంతటి బలవంతమైన జట్టునైనా మట్టి కరిపించే సామర్థ్యం ఆ జట్టు సొంతమని అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు తాను ఓడిపోవాలనుకుంటే.. ఓడిపోగలదు. గెలవాలనుకుంటే గెలవగలదు. ప్రత్యేకించి ప్రత్యర్థులు గానీ శతృవులు గానీ ఆ జట్టుకు అవసరం లేదు. పాకిస్తాన్కు పాకిస్తానే శతృవు అని అన్నారు.