
హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ వేసిన స్పిన్ బౌలింగ్ను అర్థం చేసుకోలేక ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ చేతులెత్తేశారు. ఆతిథ్య ఇంగ్లాండ్తో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన కుల్దీప్ 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో కుల్దీప్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ "ఇది నా మొదటి ఇంగ్లాండ్ పర్యటన. ఈ గడ్డపై ఇంగ్లిష్ బ్యాట్స్మెన్కు బంతులేసిన అనుభవం నాకు లేదు. నా బౌలింగ్ను వారు ఎదుర్కోలేదు. దీంతో నేను నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను. మొదట పిచ్పై బంతి బాగా తిరగలేదు" అని అన్నాడు.
"నా కంటే ముందు బౌలింగ్ వేసిన చాహల్ కూడా కాస్త ఇబ్బందిపడ్డాడు. ప్లాన్ ప్రకారం భిన్నంగా బంతులేయడం మొదలుపెట్టాను. ఇది బాగా ఉపయోగపడింది. వికెట్లు దక్కాయి. బ్యాట్స్మెన్ ఎవరన్న దాని గురించి ఆలోచించలేదు. నా బౌలింగ్పైనే దృష్టి పెట్టా. బట్లర్కు ఐపీఎల్లో బౌలింగ్ చేశా. నా బౌలింగ్లో అతడు పరుగులు రాబడతాడని ముందే ఊహించా" అని తెలిపాడు.
"నేను వేసిన మూడో ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ ఓవర్లో మూడు వికెట్లు తీశాను. ప్రస్తుతం ఇంగ్లాండ్ పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయి. తొలి పర్యటనలో అద్భుత ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్ల్లో కూడా ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా" అని కుల్దీప్ అన్నాడు.
ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ఎడమచేతి వాటం స్పిన్నర్ అంతర్జాతీయ టీ20ల్లో ఐదు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. కాగా, ఈ మ్యాచ్లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(5/24) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో లోకేశ్ రాహుల్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 5సిక్సర్లు) అద్భుత సెంచరీతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. కెప్టెన్ కోహ్లీ (8 నాటౌట్) పరుగులతో నిలిచాడు. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.