రాహుల్కు అవకాశం:
శ్రీలంకతో సిరీస్లో 'హిట్మ్యాన్' రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ నుంచి కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. ఓపెనింగ్, నాలుగు, మూడు ఎక్కడైనా అదరగొడుతున్నాడు. తాజాగా ముగిసిన లంక సిరీసులో రాణించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ కోసం శిఖర్ ధావన్, రాహుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై డ్రెస్సింగ్ రూమ్లో తలనొప్పి మొదలైంది. చేసేదేంలేక కోహ్లీ తన స్థానాన్ని మార్చుకొని రాహుల్కు అవకాశం ఇచ్చాడు. దానిని అతడు బాగానే వినియోగించుకున్నాడు.
మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలి:
ఇక ముంబై మ్యాచులో నాలుగో స్థానంలో వచ్చిన కోహ్లీ మాత్రం విఫలమయ్యాడు. కీలక సమయంలో వచ్చి 14 బంతులు ఆడి 16 పరుగులే చేశాడు. ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు భారత్ ఆడే చాలా మ్యాచులకు వ్యాఖ్యాతగా ఉన్న హెడేన్ కోహ్లీ స్థానంపై స్పందించాడు. మంగళవారం భారత ఓటమి తరువాత స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ... ' కోహ్లీ 243 మ్యాచులు ఆడాడు. అందులో 180 వరకు మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేసి 10,000 పరుగులు చేశాడు. బాగా ఆడుతున్న ఆ స్థానం నుంచి కోహ్లీ ఎందుకు తప్పుకోవాలి?. ఈ చర్యపై కనీసం చర్చైనా ఎందుకు జరగడం లేదు?. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి' అని అన్నాడు.
నాలుగో స్థానంలో 1751 పరుగులు:
ముంబై మ్యాచ్ మినహాయిస్తే.. కోహ్లీ నాలుగో స్థానంలో 38 ఇన్నింగ్స్లు ఆడాడు. 56.48 సగటు, 90.49 స్ట్రైక్రేట్తో 1751 పరుగులు చేశాడు. కోహ్లీ చేసిన మొత్తం పరుగుల్లో దాదాపు 16 శాతం. నాలుగో స్థానంలో 7 శతకాలు, 8 అర్ధ శతకాలు చేసాడు. అయితే 2015 జనవరి నుంచి మాత్రం నాలుగో స్థానంలోకోహ్లీ గణాంకాలు బాగాలేవు. 2015 నుంచి ఆరు సార్లు బరిలోకి దిగితే 9, 4, 3*, 11, 12, 7 మాత్రమే చేశాడు.
కెరీర్లో ఎక్కువగా వన్డౌన్లోనే:
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎక్కువగా వన్డౌన్లోనే ఆడాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. 243 వన్డేల్లో 59.84 సగటుతో 11,625 పరుగులు చేశాడు. అందులో 43 శతకాలు, 55 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో జట్టు కూర్పు కోసం త్యాగానికి సిద్ధపడుతున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్కు వస్తున్నాడు. తన స్థానం మార్పు గురించి మరోసారి ఆలోచించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.