
సెలక్షన్ కమిటీ స్థాయి, అనుభవం గురించి మాట్లాడుతున్నారు... ఇది మిమ్మల్ని బాధిస్తోందా?
మీకొక విషయం చెప్పాలి. సెలక్షన్ కమిటీ సభ్యులు వేర్వేరు దశల్లో టీమిండియా కోసం వేర్వేరు ఫార్మాట్లలో ఆడారు. అప్పుడున్న నిబంధనల ప్రకారమే కదా మమ్మల్ని సెలక్టర్లుగా ఎంపిక చేసింది. మా అంతర్జాతీయ కెరీర్ను పక్కన పెడితే మేమంతా కలిసి 4,77 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాం. మా పదవీ కాలంలో 200 పైగా ఫస్ట్క్లాస్ మ్యాచుల్ని చూశాం. సరైన ప్రతిభావంతుల్ని ఎంపిక చేసేందుకు మా అందరి అనుభవం సరిపోదని మీరు భావిస్తున్నారా?

మీరంతా కలిసి 13 టెస్టులే ఆడారన్న విమర్శలపై?
అంతర్జాతీయ అనుభవం, స్థాయి గురించి ఎవరైనా మాట్లాడితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుత ఛైర్మన్ ఎడ్స్మిత్ కేవలం ఒకే ఒక్క టెస్టు ఆడాడు. ఆస్ట్రేలియా క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా 13 ఏళ్లుగా (మధ్యలో విరామం వచ్చింది) పనిచేస్తున్న ట్రెవర్ హన్స్ 7 టెస్టులే ఆడిన సంగతి మీకు తెలిసిందే. 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్వా ఆయన కింద పనిచేస్తున్నారు.
87 టెస్టులు, 74 వన్డేలు ఆడిన దిగ్గజ ఆటగాడు, ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ సైతం ట్రెవర్ కిందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ దేశాల్లో స్థాయి, అనుభవం అనేవి లెక్కలోకే రావు. మన దేశంలోనే ఎందుకిలా? నేను చెప్పేదొకటే. ప్రతి పనికీ అవసరమైన డిమాండ్లు ఉంటాయి.
ఇంకా మీరు అంతర్జాతీయ అనుభవం గురించే అడిగితే... మనమంతా ప్రేమించే శ్రీ రాజ్ సింగ్ దుంగార్పుర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన హయాంలోనే కదా 16 ఏళ్ల వయసులోనే సచిన్ను ఎంపిక చేసింది.

సెలక్షన్ కమిటీ అభిప్రాయంతో కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ విభేదిస్తే చివరికి ఏం జరుగుతుంది? వారు మీపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారా?
రవిశాస్త్రి, కోహ్లీ మా సీనియర్ జట్టు కోచ్, కెప్టెన్. భారత్-ఏ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్ చూసుకుంటారు. మా అందరికీ ఎవరి పాత్రలు ఏంటో బాధ్యతలు ఏంటో స్పష్టంగా తెలుసు. మా అభిప్రాయ బేధాలను విమర్శలుగా భావించం. మా మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలను ప్రజలకు తెలియనివ్వం. నాలుగు గోడల మధ్య జరిగింది నాలుగు గోడల మధ్యే ఉండి పోతుంది. చివరికి మేం భారత జట్టు బహుళ ప్రయోజనాల మేరకే నడుచుకుంటాం.

సెలక్షన్ కమిటీపై విమర్శలు చేస్తే కోపం వస్తుందా?
ఇది దురదృష్టకరం. దిగ్గజ క్రికెటర్లపై మాకు ఎనలేని గౌరవం ఉంది. వారు వ్యక్తం చేసే ప్రతి అభిప్రాయాన్ని సరైన రీతిలోనే స్వీకరిస్తాం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. అవి మేం చక్కగానే స్వీకరిస్తాం. నిజానికి వారి విమర్శల వల్ల బాధపడే కన్నా ఈ సెలక్షన్ కమిటీ మరింత బలంగా మారుతుంది.

ఈ మూడేళ్లలో సెలక్షన్ కమిటీ పనితీరుకు మీరిచ్చే రేటింగ్ ఎంత?
మా సెలక్షన్ కమిటీ దేశం నలుమూలలా పర్యటించి దేశవాళీ క్రికెట్లో ప్రతిభావంతుల్ని గుర్తించింది. అర్హత ఉన్న వారిని తొలుత ఇండియా-ఏకు ఎంపిక చేశాం. అ తర్వాత వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేశాం.
ఎ) మేం ఎంపిక చేసిన టెస్టు జట్టు 13కు 11 సిరీస్లు గెలిచింది. మూడేళ్లుగా భారత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
బి) వన్డేల్లో మాకు 80-85 శాతం విజయాలు నమోదు చేశాం. ప్రపంచకప్ సెమీస్లో ఓటమికి ముందు భారత్ నంబర్ వన్. మేం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరుకున్నాం. రెండు ఆసియా కప్లు (2016, 2018) గెలిచాం.
సి) మేం ఎంపిక చేసిన భారత్-ఏ జట్టు 11కు 11 వన్డే సిరీస్లు గెలిచింది. 9 టెస్టు సిరీస్లకు 8 కైవసం చేసుకున్నాం.
డి) టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో మేం 35 మంది కొత్తవారికి అవకాశం కల్పించాం. అన్ని విభాగాల్లోను అవసరమైన రిజర్వు ఆటగాళ్లను బలోపేతం చేశాం. ఒక విజయవంతమైన సెలక్షన్ కమిటీగా మా బ్యాటన్ను తర్వాతి ఎంపికయ్యే కమిటీకి ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉన్నాం.


Click it and Unblock the Notifications
