
హైదరాబాద్: 'అవకాశాల కోసం ఎదురుచూడడం నిజంగానే చాలా కష్టం. అదెప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటుంది. ప్రస్తుత పర్యటనలో ఇంకా ఎక్కువగా అనిపించింది. కానీ క్రికెట్ అంటే అంతే మరి! స్టార్లు, దిగ్గజాలు నిండిన టీమిండియాలో చోటు దక్కాలంటే ఎదురుచూడక తప్పదు. ఐదో స్థానంలో ప్రయత్నించా కానీ ఇంకా మెరుగు పడాల్సి ఉంది' అని పాండే అన్నాడు.
'టీమిండియాకున్న మంచి టాప్ ఆర్డర్ లైనప్ 30 నుంచి 35 ఓవర్లు ఆడుతోంది. కోహ్లీ, ధోనీ నా కన్నా ముందే ఉన్నారు. మరికొన్ని అవకాశాలు వస్తే ఇప్పటి కన్నా ఇంకా ఎక్కువ పరుగులు చేయగలను. ఇక సెంచూరియన్ నాకు ఇష్టమైన మైదానం. ఇక్కడ బాగా ఆడతాను. భారత్ తరఫున ఐదో స్థానంలో ఆడటం చాలా కష్టం. నా కన్నా ముందు ఈ స్థానంలో ఆడిన యువీ, రైనా అడుగుజాడల్లో నడవడం తేలిక కాదు. జట్టు బ్యాటింగ్ బాగుంది కాబట్టి అవకాశాల కోసం ఎదురుచూడక తప్పదు' అని మనీశ్ అన్నాడు.
'రెండో టీ20లో దక్షిణాఫ్రికా బౌలింగ్ బాగుంది కాబట్టి 170 పరుగులు చేస్తామని అనుకున్నాం. చివరల్లో ధోనీ పుంజుకోవడం వల్ల 188 చేయగలిగాం. అందుకనే చివర్లో వచ్చిన 20 పరుగులను బోనస్ పరుగులనుకుంటాం' అని పాండే ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
గతంలో యువరాజ్, రైనా వంటి సీనియర్ ఆటగాళ్లు ఆడిన ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం, వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమని పాండే అభిప్రాయపడుతున్నాడు. ఇలా తనకు అచ్చొచ్చిన సెంచూరియన్ స్టేడియంలో అదరగొట్టాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 48 బంతుల్లోనే 79 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గతంలో ఇదే మైదానంలో టీ20లో శతకం బాదేశాడు ఈ యువ బ్యాట్స్మన్. జట్టులో అవకాశాల కోసం ఎదురుచూడడం కష్టమే కానీ అంతా మన ఆలోచనా విధంగలోనే ఉంటుందని అంటున్నాడు.