హార్దిక్ పాండ్యను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. 2022 సీజన్లో గుజరాత్ను హార్దిక్ విజేతగా నిలిపాడు. అంతేగాక 2023 సీజన్లో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే సక్సెఫుల్ కెప్టెన్గా నిలిచిన హార్దిక్ను గుజరాత్ వదులుకోవడానికి కారణమేంటి అనేది అందరి ప్రశ్న.
హార్దిక్ పాండ్య కోసం ముంబయి ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్కు భారీ బదిలీ రుసుమును చెల్లించిందని తెలుస్తోంది. ఈ స్టార్ ఆల్రౌండర్ కోసం దాదాపు రూ.100 కోట్లు చెల్లించిందని సమాచారం. 2021 ఐపీఎల్లో భాగం కావడానికి గుజరాత్ టైటాన్స్ సీవీసీ క్యాపిటల్గా రూ.5625 కోట్లు వెచ్చించింది. అయితే ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ బలమైనది. ముంబయి ఫ్రాంచైజీలో వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. కానీ గుజరాత్ ఫ్రాంచైజీ పరిస్థితి అంత గొప్పగా లేదు.

హార్దిక్ పాండ్య వదులుకోవడంతో ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ పర్స్ వ్యాల్యూ రూ.15 కోట్లు పెరిగింది. కానీ ముంబయి బదిలీ రుసుము ఎంత మొత్తం చెల్లించిందనే విషయం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు.ఈ ఆర్థిక సంవత్సం చివరిలో సీవీ క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో అది కనిపించనుంది. హార్దిక్ కోసం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ముంబయికి ఓ ప్రధాన కారణం ఉన్నట్టు తెలుస్తోంది.
2025లో మెగా వేలం ఉండటంతో ముంబయి ఇండియన్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ సమయానికి నలుగురు ప్లేయర్లనే ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ను ముందే దక్కించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే టీమిండియా భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అవుతాడనే అంచనాలు మరో కారణం. అందుకే రోహిత్ శర్మను కాదని ముంబయి పగ్గాలు హార్దిక్ పాండ్యకు అప్పగించింది.
కాగా, ప్రపంచకప్లో గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్య జనవరిలో ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక టీమిండియాను హార్దిక్ నడిపించనున్నట్లు సమాచారం. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జూన్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీ ముందు టీమిండియా ఆడే ఆఖరి టీ20 సిరీస్ అఫ్గానిస్థాన్తోనే.