హైదరాబాద్: భారత ప్రధాన కోచ్ పదవికి టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసినట్లు బీసీసీఐ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సోమవారం ఓ జాతీయ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కోచ్ పదవి కోసం మరిన్ని దరఖాస్తులు ఆహ్వానించింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి కోసం బీసీసీఐ జులై 9 వరకు గడువుని కూడా పెంచింది.
ఇప్పటికే కోచ్ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డా గణేశ్, లాల్చంద్ రాజ్పుత్లు దరఖాస్తులు చేసుకున్నారు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులను గంగూలీ, లక్ష్మణ్, సచిన్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
కోచ్ పదవికి పోటీ క్రమంగా పెరుగుతోంది. తాజాగా కోచ్ రేసులోకి ఓ మాజీ ఆటగాడు వచ్చి చేరాడు. అతడి పేరు పిల్ సిమన్స్. గతంలో వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు ఈ వెస్టిండిస్ ఆల్ రౌండర్ కోచ్గా పని చేశాడు. అంతేకాదు కోచ్గా సిమన్స్కు మంచి రికార్డు ఉంది.
ఇదిలా ఉంటే కోచ్ రేసులో రవిశాస్త్రియే అందరి కన్నా ముందంజలో ఉన్నారు. టీమిండియా మాజీ డైరెక్టర్ పనిచేసిన రవికి సారథి విరాట్కోహ్లీ మద్దతు ఉంది. సీనియర్ ఆటగాళ్లతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాగా, ఆదివారం కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ జులై 10న కొత్త కోచ్ను ప్రకటిస్తామని తెలిపాడు.