
ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ కంటే కొన్ని రోజుల ముందు జరగనున్న ఈ సిరీస్లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. ఇకపోతే ఈ సిరీస్లో అందరి దృష్టి చాలా రోజుల తర్వాత తిరిగి జట్టులోకి వస్తున్ స్టార్ పేసర్ దీపక్ చాహర్పైనే ఉంది. భారత మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్.. జింబాబ్వే సిరీస్ విషయమై అలాగే దీపక్ చాహర్ పునరాగమనంపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.
దీపక్ చాహర్ చివరిసారిగా ఫిబ్రవరిలో భారత జట్టు తరపున ఆడాడు. ఆ సిరీస్లో దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. అప్పటి నుంచి అతని గాయం తీవ్రత పెరిగింది. తద్వారా అతను మొత్తం ఐపీఎల్ 2022 టోర్నమెంట్కు దూరమయ్యాడు. జింబాబ్వే సిరీస్ ద్వారా మళ్లీ అతను గ్రౌండ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి తర్వాత మళ్లీ అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత చాహర్ తిరిగి రావడం, అలాగే బౌలింగ్లో తన లయ అందుకోవడం అంత సులభం కాదని మణీందర్ సింగ్ పేర్కొన్నాడు. స్వింగ్ బౌలర్ విషయంలో జట్టు మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు.'అవును దీపక్ చాహర్ విషయంలో ఇది చాలా సుదీర్ఘ విరామం. అతనికి గాయమై చాలా నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం అంత సులభం కాదు. అతన్ని జట్టులో ఆడించేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ అతనిని ఎప్పుడు ఉపయోగించాలో మరియు ఎప్పుడు ఉపయోగించకూడదో జట్టు మేనేజ్మెంట్కు తెలుసని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
అతను ప్రతిభావంతుడైన కుర్రాడు. ఏదేమైనా అతను మళ్లీ జట్టులోకి రావడం ఒకింత మంచి వార్తేనని' అని మణిందర్ తెలిపాడు.విశ్రాంతి పేరిట విరాట్ కోహ్లీని జింబాబ్వే సిరీస్ నుండి తప్పించడం గురించి మణీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు సెలెక్టర్లతో స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంచుకోవాలని.. అతను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడా అయితే అతని అభ్యర్థనను గౌరవించాలని, లేకపోతే కొన్ని సిరీస్లకు యువ జట్టును ప్రయోగించాలని సెలెక్షన్ కమిటీ చూస్తుండొచ్చని మణిందర్ పేర్కొన్నాడు. కోహ్లీ గొప్ప ఆటగాడని.. అతని తన మెంటల్ స్ట్రెంత్ ద్వారా తిరిగి ఫామ్ పుంజుకుంటాడని కూడా చెప్పాడు.