అలా ఆడటం వధువు లేని పెళ్లి లాంటిది .. అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

కరాచీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లోనూ లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆటలు ఆడించే దిశగా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలని పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. అయితే అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడితే అస్సలు మజా ఉండదని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు.

వధువు లేని పెళ్లి లాంటిది:
తాజాగా హలో యాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'ప్రేక్షకులు లేని స్టేడియంలో క్రికెట్ ఆడించేందుకు బోర్డులు ఆమోదం తెలపవచ్చు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడటం వల్ల క్రికెట్ బోర్డులకు మేలు జరగవచ్చు. అయితే ఇది అంతగా ఆకట్టుకుంటుందని నేను అనుకోను. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ ఆడటం వధువు లేని పెళ్లి లాంటిది. ఆటలు ఆడాలంటే స్టేడియం ప్రేక్షకులతో నిండిపోవాలి. జన సందోహం ఉంటే వచ్చే మజానే వేరు. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఏడాదిలో పరిస్థితి సాధారణస్థితికి వస్తుందని అనుకుంటున్నా' అని అన్నాడు.

మ్యాచ్లో మజా ఉండదు:
ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహించే అంశంపై గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించవచ్చని కోహ్లీ చెప్పాడు. అయితే ఈల, గోలలేని మ్యాచ్లో మజా, మ్యాజిక్ ఉండవన్నాడు. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించాడాన్ని చాలా మంది సపోర్ట్ చేస్తుండగా.. కొంతమంది మాత్రమే మజా ఉండదు అని అంటున్నారు. బెన్ స్టోక్స్, జేసన్ రాయ్, జొస్ బట్లర్, పాట్ కమిన్స్ ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరగాలని కోరుతున్నారు.

ఖాళీ స్టేడియంలో ఆడటం విచిత్రంగా ఉంటుంది:
'ఖాళీ స్టేడియంలో క్రికెట్ ఆడటం విచిత్రంగా ఉంటుంది. అభిమానులు అందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. నా చిన్నతనంలో ఎవరూ లేని చోట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఐపీఎల్ టోర్నీపై బోర్డు ఏ నిబంధనలతో ముందుకొస్తుందో.. వాటిని పాటించక తప్పుదు. ఇలా చేస్తే.. కనీసం అభిమానులు మమ్మల్ని టీవీలో అయినా చూస్తారు. వారికి అది కాస్త ఊరటనిస్తుంది' అని రోహిత్ శర్మ అన్నాడు.

ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం:
ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించాడాన్ని చాలా మంది సపోర్ట్ చేస్తుండగా.. కొంతమంది మాత్రమే మజా ఉండదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అదిరిపోయే సలహా ఇచ్చాడు. క్రీడలు మొదలయ్యాక స్టేడియాల్లో ప్రేక్షకులు చేసే గోలను ఆడియో రూపంలో ఏర్పాటు చేస్తే.. మైదానంలో వారు ఉన్నట్లే ఫీలవుతామని ఆర్చర్ పేర్కొన్నాడు. మొత్తానికి ప్రేక్షకులు లేకుంటే ఏం.. ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని ఆర్చర్ అంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications