హైదరాబాద్: క్రికెట్లో అరంగేట్రం కంటే పునరాగమనం చేయడమే ఎంతో కష్టమని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన మూడు వన్డేల సిరీస్కి ఎంపికైన దినేశ్ కార్తీక్.. మూడు వన్డేల్లో కలిపి మొత్తం 105 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
ఈ ప్రదర్శన డిసెంబర్లో శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరిస్కి తనని ఎంపికయ్యేలా చేయడంలో దోహదపడుతుందని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ సిరిస్ అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మ్యాచ్ల్లో పునరాగమనం అనేది ఎప్పుడూ కష్టమేనని చెప్పుకొచ్చాడు.

'అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం కంటే పునరాగమనం చేయడం చాలా కష్టం. మనం మొదటిసారి జట్టులో అరంగేట్రం చేసిన దాని కంటే తిరిగి జట్టులో సంపాదించడమే చాలా కష్టం. భారత్ తరఫున సుదీర్ఘంగా మ్యాచ్లు ఆడిన అనంతరం జట్టులో చోటు కోల్పోయి.. మళ్లీ తాను జట్టుకి అర్హుడినంటూ నిరూపించుకునే క్రమంలో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది' అని అన్నాడు.
ముఖ్యంగా ఇది నిన్ను నీవు నిరూపించుకోవడానికి మానసిక ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వన్డే జట్టులో నాకు చోటు ఉంటుందనే ఆశిస్తున్నా. న్యూజిలాండ్ తో సిరీస్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. జట్టులో ఈ స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని ఏమీ నేను అనుకోవడం లేదు. మేనేజ్మెంట్ అందించే ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు నేను సిద్ధం' అని కార్తీక్ వెల్లడించాడు.