చిరునవ్వు వెనక వెలకట్టలేని బాధ
నువాన్ కులశేఖర బౌలింగ్లో 49వ ఓవర్ రెండో బంతికి ఎంఎస్ ధోనీ సిక్సర్ కొట్టిన వెంటనే నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న యువరాజ్ సింగ్ ఆనందంతో మహీని హత్తుకున్న సమయంలో అక్కడే వికెట్ల వెనకాల ఉన్న లంక కెప్టెన్ కుమార సంగక్కర చిరునవ్వును చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. సంగక్కర చిరునవ్వు చిందిస్తూ మహీ వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. ప్రపంచకప్ చేజారినా.. గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే చిరునవ్వుతో ఆ ఓటమిని స్వీకరించాడు. లంక అభిమానులతో సహా, యావత్ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్ చేసింది. అయితే సంగక్కర చిరునవ్వు వెనక వెలకట్టలేని బాధ బాగుంది. అలాంటి బాధాకర సమయంలో కూడా తన ముఖంపై చిరునవ్వుకు గల కారణాలను సంగక్కర తాజాగా వెల్లడించాడు.
ఆ విషయం నా దేశం నేర్పింది
తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో ఇన్స్టాగ్రామ్లో మాట్లాడిన సంగక్కర 2011 వన్డే ప్రపంచకప్ నాటి విశేషాలను పంచుకున్నాడు. '30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను (అప్పుడు). ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అయినా కూడా శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. స్థితిస్థాపకత. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వస్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాం' అని సంగక్కర తెలిపాడు.
ఆడినప్పుడల్లా గెలవాలనే అనుకుంటాం
'మేం మ్యాచ్ ఆడినప్పుడల్లా గెలవాలనే అనుకుంటాం. మాది గట్టి పోటీనిచ్చే జట్టు. మ్యాచ్లో గెలిచినా, ఓడినా.. ఆ ఫలితాన్ని ఎలా స్వీకరించాలి అనేదానిపైనే దృష్టిసారిస్తాం. ఆ చిరునవ్వు నిరాశతో కూడిన ఎంతో బాధను కప్పిపుచ్చింది. దాని వెనుక రెండు కోట్ల మంది లంకేయుల ఆశలు ఉన్నాయి. 2007, 2011లో శ్రీలంకకు వన్డే ప్రపంచకప్లు గెలిచే అవకాశం వచ్చింది. అలాగే 2009, 2012లోనూ టీ20 ప్రపంచకప్లు సాధించే అవకాశం ఉండింది. ఫలితం ఏదైనా జీవితమంటే ఇలాగే ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. జట్టు గెలుపులతో మరీ విర్రవీగిపోదు.. అలాగే ఓటములతో మరీ కుంగిపోదు' అని సంగక్కర చెప్పాడు.
భారత్ విజయం
వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ని ధోనీ ముగించాడు.