MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ స్టార్ ఎంఎస్ ధోని చెపాక్ కాకుండా తనకు ఇష్టమైన స్టేడియం పేరును వెల్లడించాడు. ఆ స్టేడియం తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని ఎంఎస్ ధోని అన్నాడు. 43 ఏళ్ల ధోని ఆ స్టేడియంతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నాడు. చెపాక్తో పాటు ముంబైలోని వాంఖడే స్టేడియంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ తర్వాత జట్టుకు లభించిన ఉత్సాహభరితమైన స్వాగతాన్ని ధోని గుర్తు చేసుకున్నాడు.
ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను కేవలం 0.12 సెకన్లలో స్టంప్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. జియో హాట్ స్టార్లో ఎంఎస్ ధోని తన అనుభవాల గురించి పంచుకున్నారు. తనకు ఇష్టమైన స్టేడియం, దానికి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నాడు. "నాకు ఇష్టమైన మైదానం మరొకటి ఉందని నేను చెప్పలేను ఎందుకంటే దాదాపు ప్రతిచోటా మాకు అద్భుతమైన స్వాగతం లభించింది. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఇక్కడ అద్భుతమైన స్వాగతం లభించింది. కాబట్టి ముంబైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్ కూడా ముంబైలోనే జరిగింది. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే దానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది." అని ఎంఎస్ ధోని చెప్పుకొచ్చాడు.

ఇది కాకుండా బెంగళూరులో ఆడినా ప్రేక్షకులు చాలా ఉత్సాహం ఆదరిస్తారని.. కోల్కతా, అహ్మదాబాద్ స్టేడియాలు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తాయని.. కాబట్టి ఒకదాన్ని ఎంచుకోవడం కష్టమని ఎంఎస్ ధోని చెప్పారు. అభిమానులు ప్రతిచోటా జట్టుకు మద్దతు ఇస్తారని.. చెపాక్ ప్రత్యేకమైనది ఎందుకంటే అక్కడ ప్రేక్షకులు విజిల్స్ తో జట్టును ప్రోత్సహించారని ధోని చెప్పాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. ధోని బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ క్రీజులోకి స్వాగతించారు.