వన్డే వరల్డ్ కప్లో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దాదాపు మూడు నెలల తర్వాత తిరిగి పోటీ క్రికెట్ ఆడుతున్నాడు. ముంబయిలో జరుగుతున్న డీవై పటే టీ20 కప్లో రిలయన్స్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ట్రేడింగ్లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ తిరిగి ముంబయి గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే అతడికి ముంబై యాజమాన్యం జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని స్టార్ ఆల్రౌండర్కు బాధ్యతలు అందించింది.

అయితే మీడియాకు దూరంగా ఉండే హార్దిక్ పాండ్య ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. ఇందులో తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేశాడు. బయట తిరగడం కంటే ఇంట్లో ఉండటానికే ఎక్కువ ఇష్టపడతానని పేర్కొన్నాడు. ''నా గురించి నా అభిమానులకు తెలియని విషయం ఏంటంటే.. నేను బయటకు ఎక్కువగా వెళ్లను. ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా. తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తా. గత మూడు నాలుగేళ్లలో నేను వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అవి కూడా స్నేహితుల కోసమే వెళ్లి ఉంటా. ఇంట్లోనే ఉంటుంటా''
''ఇటీవల ఇంట్లో నుంచి 50 రోజుల పాటు బయటకు రాలేదు. కనీసం ఇంట్లో ఉన్న లిఫ్ట్ను కూడా చూడలేదు. ఇంట్లోనే జిమ్, థియేటర్, నాకు కావాల్సినవి అన్నీ ఉంటాయి'' అని హార్దిక్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో సూపర్ కార్లతో వైరల్ అయిన తన ఫొటోల గురించి హార్దిక్ స్పందించాడు. టెస్టు డ్రైవ్ కోసం ఒకరు తన వద్దకు కారును పంపించారని చెప్పాడు. ఇక మీడియాలో తాను మాట్లాడనని, ఇప్పటివరకు అది చేయలేదని చెప్పాడు. ఇలా ఉండటం తనకేం బాధ కలిగించలేదని పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బంతిని కాలుతో ఆపే క్రమంలో హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. బుధవారం బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఏ గ్రేడ్లో హార్దిక్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.