ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సర్ల ఊచకోతకు గురువారంతో సరిగ్గా 17 ఏళ్లు. ఈ నేపథ్యంలో యువరాజ్ బ్యాటు వేటుకు బలి అయిన ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో యువీ మిగిల్చిన పీడ కల గురించి మాట్లాడాడు.
యువరాజ్ సింగ్ విధ్వంసానికి సంబంధించిన వీడియోను ఆ తర్వాత ఎన్నడూ చూడలేదని స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు. అయితే ఆ ఓవర్లో పొరపాటును నో బాల్ పడితే.. దాన్ని కూడా యువీ సిక్సర్గా మలిచేవాడని, అంతటి ఊపులో యువరాజ్ ఉన్నాడని అన్నాడు. అదృష్టవశాత్తు ఆ ఓవర్లో నో బాల్ వేయలేదని బ్రాడ్ పేర్కొన్నాడు.

2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో యువరాజ్ అన్ని బంతుల్ని సిక్సర్లుగా మలిచిన సంగతి తెలిసిందే. ఈ అపూర్వ ఘట్టాన్ని భారత క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేదరు. 2007 సెప్టెంబర్ 19న ఈ విధ్వంసం జరిగింది. యువరాజ్ను లక్ష్యంగా చేసుకుని ఫ్లింటాఫ్ చేసిన కవ్వింపులు స్టువర్ట్ బ్రాడ్కు శాపంగా మారింది. చరిత్రకు నాంది పలికింది.
టీ20ల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్గా యువీ ఆ రోజు చరిత్ర సృష్టించాడు. అలాగే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ మ్యాచ్లో 17వ ఓవర్లో యువరాజ్ క్రీజులోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫ్లింటాఫ్ బౌలింగ్లో యువీ రెండు ఫోర్లు బాదాడు. అనంతరం యువీని ఫ్లింటాఫ్ కవ్వించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన యువరాజ్ తర్వాతి ఓవర్లో పెను విధ్వంసం సృష్టించాడు.
బ్రాడ్ వేసిన మొదటి బంతిని డీప్ వికెట్కు, లాంగాన్కు మధ్యగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని ఫ్లిక్తో డీప్ మీదుగా స్టాండ్స్లో పడేశాడు. ఇక తర్వాత ఎక్స్ట్రా కవర్స్, బ్యాక్వర్డ్ పాయింట్, ఓవర్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్ల వర్షం కురిపించాడు.ఆఖరి బంతిని వైడ్ మిడాన్ మీదుగా సిక్స్ కొట్టి యువీ చరిత్ర సృష్టించాడు.