
టీమిండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. నిలకడగా 150 కిలోమీటర్లపైగా వేగంతో బంతులు వేస్తూ చాలా మందిని ఎగ్జయిట్ చేశాడీ జమ్మూ కాశ్మీర్ పేసర్. గతేడాది సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున చెలరేగిన అతను ఏకంగా 22 వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. దీంతో అతనికి భారత జట్టు నుంచి కూడా పిలుపొచ్చింది. భారత్ తరఫున కూడా ఉమ్రాన్ ఫర్వాలేదనిపించాడు. అయితే పరుగులు ధారాళంగా ఇస్తున్నాడని, బౌలింగ్లో అంతగా వేరియేషన్ లేదని అతనిపై విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ అతనికి కీలకమైన సలహా ఇచ్చాడు. ఉమ్రాన్ (Umran Malik) ముఖ్యంగా తన పేస్ బౌలింగ్ పైన మాత్రమే ఫోకస్ పెట్టాలని చెప్పాడు. ఇలా 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం వల్ల బ్యాటర్లు తడబడతారని చెప్పాడు. 'తన బంతులు ఎక్కడ పడుతున్నాయని ఉమ్రాన్ ఎక్కువ వర్రీ అవకూడదు. అనుభవం వచ్చే కొద్దీ అతనికి ఇవన్నీ అర్థం అవుతాయి. కాబట్టి 150 లేదా 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలిగితే.. దానిపైనే ఉమ్రాన్ ఫోకస్ పెట్టాలి' అని ఇషాన్ సూచించాడు.
ధారాళంగా పరుగులు ఇస్తున్నాడని ఉమ్రాన్ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. పరుగుల గురించి పట్టించుకోకుండా వేగంగా బౌలింగ్ చేయడంపైనే ఉమ్రాన్ కష్టపడాలని సూచించాడు. 'బ్యాటర్లు భయంతో కళ్లు మూసుకోనప్పుడు అంత వేగంగా బౌలింగ్ చేసి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి ఎవరో ఒకరు అతనికి ఇదే విషయం చెప్పాలి. బ్యాటర్లు చూడలేనంత వేగంగా బౌలింగ్ చేయాలని ఉమ్రాన్కు (Umran Malik) ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉంది' అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు. పవర్ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంపై ఉమ్రాన్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. మిడిల్ ఓవర్లలో రాణిస్తున్నా.. పవర్ప్లే, డెత్ ఓవర్లలోనే ఉమ్రాన్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయంపై కనుక అతను ఫోకస్ పెడితే కచ్చితంగా వరల్డ్ కప్లో కూడా అతనికి చోటు దక్కే ఛాన్స్ ఉంది.