న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా డెంగీ, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా చికెన్ గున్యా బారిన పడ్డాడు. ఇశాంత్ కు చికెన్ గున్యా సోకినట్టు టీమ్ ఇండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించారు.
ప్రస్తుతం ఇశాంత్ చికెన్ గున్యా బాధపడుతుండడంతో.. ఈ నెల 22న న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టీమ్ ఇండియా 500వ టెస్ట్ కు ఇశాంత్ ఆడడం దాదాపుగా అసాధ్యమే. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన కుంబ్లే.. ఇశాంత్ చికెన్ గున్యా బారిన పడడంతో అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ప్రస్తుత జట్టులో మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్లతో కూడిన పేస్ బౌలర్లు మాత్రం అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఇండియా తరుపున వరుసగా మ్యాచ్ లు ఆడుతూ వస్తున్న ఇశాంత్ ఇప్పటిదాకా 72 మ్యాచ్ లు ఆడాడు. ఇటీవలి విండీస్ టూర్ లోను 32.12 సగటుతో 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.