హైదరాబాద్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఊరట కలిగించే వార్త. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇషాంత్ శర్మను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ తీసుకుంది. దీంతో ఇషాంత్ శర్మ టీ20 కెరీర్ గాడిలో పడినట్లే అనిపిస్తోంది.
ఈ ఏడాది బెంగుళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో ఇషాంత్ శర్మ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించారు. దీంతో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఇషాంత్ శర్మ చేరాడు.
వేలంలో అమ్ముడుపోని ఇషాంత్: గంభీర్ చెప్పిన కారణం ఇదీ
అయితే పంజాబ్ జట్టులో పేస్ ఎటాక్ అంత బలంగా లేకపోవడంతో ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకుంది. అంతకముందు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లకు ఆడాడు. టెస్టు క్రికెటర్గా పేరొందిన ఇషాంత్ భారత్ తరుపున 77 టెస్టు మ్యాచ్లు ఆడాడు.
ఎప్పటినుంచో ఇషాంత్ శర్మ ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ చెప్పుకోదగ్గస్థాయిలో రాణించలేకపోయాడు. గత సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జైయింట్ తరఫున ప్రాతినిథ్యం వహించి కేవలం రెండు మ్యాచ్ల్లో ఆడాడు. ఇప్పటి వరకు 107 టీ20 మ్యాచ్లు ఆడిన ఇషాంత్ 88 వికెట్లు తీసుకున్నాడు.
ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చకపోవడంపై అప్పట్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇషాంత్ శర్మ కనీస ధరను ఎక్కువగా నిర్ణయించడం వల్లే వేలంలో అతడు అమ్ముడుపోలేదని చెప్పాడు.
'ఇషాంత్ కనీస ధరను చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. నిజం చెప్పాలంటే అది చాలా ఎక్కువ' అని గంభీర్ అన్నాడు. అంతేకాదు తాను ఆ విధంగా మాట్లాడటానికి గల కారణాలను సైతం గంభీర్ వెల్లడించాడు. ఐపీఎల్లో టీ20 టోర్నీ. ఈ మ్యాచ్లో ఇషాంత్ కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడు.
ఐపీఎల్ 2017: వేలంలో అమ్ముడుపోని టాప్ 12 ఆటగాళ్లు వీరే
అదే బెన్ స్టోక్స్ లాంటి ఆటగాళ్ల కనీస ధరను రూ. 2 కోట్లు నిర్ణయించడం వెనుక అతడు బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా రాణిస్తాడని గంభీర్ చెప్పుకొచ్చాడు.