ఫేమ్ వచ్చిన తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మారిపోయాడని సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఖండించాడు. కోహ్లి ఏం మారలేదని, ప్రారంభం నుంచి ఉన్న విధంగానే ఉంటున్నాడని ఇషాంత్ తెలిపాడు. దాదాపు 15 ఏళ్లగా కోహ్లితో స్నేహబంధం ఉందని, విరాట్లో ఎలాంటి మార్పు లేదని అన్నాడు.
'మైకేల్'కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి గురించి ఇషాంత్ శర్మ మాట్లాడాడు. బెంగళూరులోని స్టీఫెన్ జోన్స్ నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్కు హాజరైన ఇషాంత్ మైకేల్తో ముచ్చటించాడు. కోహ్లి తనకి ఓ సోదరుడులాంటి వాడని ఇషాంత్ తెలిపాడు. భారత్ తరఫున 100కు పైగా టెస్టులు ఆడిన వీరిద్దరు ఢిల్లీకి చెందిన ఆటగాళ్లు.

అండర్-17 క్రికెట్ నుంచి కోహ్లి-ఇషాంత్ కలిసి ఆడారు. గత ఐపీఎల్-2024 సీజన్లో కోహ్లి X ఇషాంత్ ఫైట్ నెట్టింటిని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో బౌండరీలు బాదుతూ జోరు మీదున్న కోహ్లిని ఇషాంత్ ఔట్ చేశాడు. అయితే ఔటైన అనంతరం కోహ్లిని ఇషాంత్ సరదాగా కవ్వించాడు. సహజంగా ప్రత్యర్థి కవ్విస్తే రెచ్చిపోయే కోహ్లి.. ఇషాంత్ విషయంలో మాత్రం చిరునవ్వుతూ స్పందించాడు.
''కోహ్లి మారిపోయాడని ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ మా మధ్య ఉన్న అనుబంధంతో చెబుతున్నా. కోహ్లి ఏమాత్రం మారలేదు. అండర్-17 నుంచి మేం కలిసి క్రికెట్ ఆడుతున్నాం. మాకు ఇప్పుడు వయస్సు 36. దాదాపు 15 ఏళ్లకు పైగా కోహ్లి నుంచి నాకు తెలుసు. నా దృష్టిలో అయితే కోహ్లి ఏం మారలేదు. ఏ టైమ్కు అయినా మేం ఇప్పటికీ కాల్స్ మాట్లాడుకుంటాం''
''కెప్టెన్గా అతన్ని చూసి అపార్థం చేసుకున్నారేమో. సారథిగా అదనపు బాధ్యతలు ఉంటాయి. అయితే అతన్ని వ్యక్తిగతంగా చూడాల్సింది. నాయకుడిగా అతను 15 మంది ప్లేయర్లపై దృష్టిసారించాలి. తుదిజట్టులో ఆడని ఓ ప్లేయర్పై అతను ఫోకస్ చేయలేడు. బహుశా..ఈ కారణంతో కోహ్లిని తప్పుగా అనుకుంటున్నారనుకుంటా. అతను సారథిగా ఉన్నప్పడు నాకు తుదిజట్టులో చోటు దక్కని సందర్భంలో.. అతని రూమ్కు వెళ్లి ప్రణాళికలు గురించి మాట్లేడేవాడిని''
''తుదిజట్టులో ఉన్నప్పటికి జట్టు ప్లాన్స్ గురించి చర్చించేవాడిని. కమ్యూనికేషన్ లోపంతో ఇలా అపార్థం చేసుకుని ఉంటారు. కోహ్లి నాకు మంచి ఫ్రెండ్ కూడా కావడంతో మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ డిఫ్రెన్స్ జరగలేదు. చాలా కాలంగా కలిసి ఆడాం. కోహ్లి ఏం మారలేదు'' అని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. అమిత్ మిశ్రా వ్యాఖ్యలను ఇషాంత్ శర్మతో పాటు సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఖండించాడు. కోహ్లి ఏం మారలేదని, గతంలో ఉన్నట్లుగానే అందరితో మంచిగా ఉన్నాడని చావ్లా తెలిపాడు.
అసలేం జరిగిందంటే..ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ మిశ్రా కోహ్లిపై ఘూటు విమర్శలు చేశాడు. రోహిత్ శర్మతో పోలుస్తూ కోహ్లి వ్యవహార శైలి బాగోలేదని, డబ్బు, పేమ్తో మారిపోయాడని మిశ్రా అన్నాడు. కెప్టెన్సీకి ముందు కోహ్లి ఒకలా, తర్వాత మరోలా ఉన్నాడని తెలిపాడు. కానీ రోహిత్ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉన్నాడని, హిట్మ్యాన్ స్వభావం ఏం మారలేదని పేర్కొన్నాడు.