
లండన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021 టైటిల్ను తృటిలో చేజార్చుకున్న బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. ఇషాంత్ కుడి చేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలవ్వడంతో మూడు కుట్లు వేశారు. దీంతో అతను ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అనుమానాలు మొదలయ్యాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం కూడా కోహ్లీసేన అక్కడే ఉంటుంది. ఆగష్టు 4న భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
ఇషాంత్ శర్మ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగింపు దశలో గాయపడ్డాడు. న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో అతడు గాయం బారిన పడ్డాడు. రాస్ టేలర్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్ ఆపే క్రమంలో.. తన బౌలింగ్లోనే గాయపడ్డాడు. అతని చేతి వేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతను మైదానాన్ని వీడాడు. ఆపై మూడు కుట్లు వేశారు. మరో 10 రోజుల్లో కుట్లు తొలగించనున్నారు. దాంతో తొలి టెస్టుకు నెలకు పైగా సమయం ఉండడంతో అతడు కోలుకుంటాడడని బీసీసీఐ భావిస్తోంది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్కు ముందు కోహ్లీసేనకు వార్మప్ మ్యాచ్లు లేవని, కేవలం ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లే ఉంటాయని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. టెస్టు సిరీస్కు ముందు కోహ్లీసేన ప్రాక్టీస్ కోసం కౌంటీ జట్లతో ఫస్ట్క్లాస్ మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ కోరడంతో ఈసీబీ ఇలా స్పందించింది. కరోనా నిబంధనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దుర్హమ్లోని రివర్సైడ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్లు ఉంటాయని తెలిపింది. అయితే వీటికి సంబంధించిన తేదీల వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్లోనే ఉన్న భారత ఆటగాళ్లకు ఇప్పుడు 20 రోజుల పాటు విశ్రాంతి ఇచ్చారు. దాంతో వారంతా కుటుంబాలతో సహా బయటకు వెళ్లడానికి అనుమతులు లభించాయి. జులై 14న తిరిగి లండన్లో ఏకమై.. మళ్లీ క్వారంటైన్లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాతే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.