
హైదరాబాద్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ తన బలాల్ని గుర్తించలేకపోతున్నాడని మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం సఫారీ పర్యటనకు బయల్దేరనుంది. ఈ నేపథ్యంలో బుధవారం వెంకటేశ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడాడు.
సఫారీ పర్యటనలో ఇషాంత్ శర్మ తన బలాల్ని గుర్తిస్తే.. టెస్టు సిరీస్లో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన చేయగలదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. జనవరి 5న ఇరు జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాలోని ఫాస్ట్ పిచ్లను దృష్టిలో పెట్టుకుని భారత సెలక్టర్లు ఐదుగురు పేసర్లకు జట్టులో చోటు కల్పించారు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు ఇప్పటికే టెస్టుల్లో తమ సత్తాని నిరూపించుకోగా.. వన్డే, టీ20ల్లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా ఈ సిరిస్తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.
'దశాబ్ద కాలంగా ఇషాంత్ శర్మ జట్టులో ఉన్నాడు. ఓ ఫాస్ట్ బౌలర్కి ఇది చాలా ఎక్కువ సమయమనే చెప్పాలి. అతడు పేస్ను లీడ్ చేయాల్సిన సమయం వచ్చింది. కానీ, ఇషాంత్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. అతని సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎత్తు ఉన్నాడు.. పిచ్ నుంచి పేస్ రాబట్టగలడు.. మైదానంలో దూకుడుగానూ ఉంటాడు. కానీ.. అతను తన బలాల్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. గతంలో ఇవే అర్హతలున్న జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, కపిల్ దేవ్ జట్టు తరఫున అద్భుతాలు చేశారు' అని ప్రసాద్ అన్నాడు.
'వీరంతా భిన్నంగా ఉంటారు. ఎక్కువ క్రికెట్ ఆడటం వల్లే వాళ్లు అలా ఉన్నారు. గత 10-15 ఏళ్లలో ఉన్న పిచ్లకు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్న పిచ్లకు తేడా ఉంది. ఫాస్ట్ బౌలర్లకు దక్షిణాఫ్రికా పరిస్థితులను
అర్ధం చేసుకుంటే స్వదేశంలో మాదిరి ఎక్స్స్ట్రా బౌన్స్ని రాబట్టగలరు' అని వెంకటేశ్ ప్రసాద్ సూచించారు.