మానసిక అలసట కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. నవీ ముంబై వేదికగా జరుగుతున్న డీవై పటేల్ టీ20 కప్లో ఆర్బీఐ జట్టు తరఫున పోటీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ పునరాగమన మ్యాచ్లో ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న అతను 19 పరుగులు చేశాడు. రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
అయితే 25 ఏళ్ల ఇషాన్ వికెట్కీపింగ్లో ఫర్వాలేదనిపించాడు. సయాన్ బౌలింగ్లో సుమిత్ను స్టంపౌట్చేశాడు. కాగా, రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ఆర్బీఐ 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత రూట్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆయుష్ 31 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది.

భారత్ తరఫున ఇషాన్ కిషన్ చివరిగా గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో బరిలోకి దిగాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ అర్ధంతంగా పర్యటన నుంచి తప్పుకున్నాడు. మానసిక అలసట కారణంగా స్వదేశానికి తిరిగొచ్చాడు. అనంతరం అతడు తిరిగి రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ లేదా పోటీ క్రికెట్ ఆడాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు.
కానీ ఇషాన్ కిషన్ వడోదరలో పాండ్య బ్రదర్స్తో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇషాన్ కిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీమిండియాకు దూరంగా ఉండి సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ ఇషాన్ రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగలేదు. దీంతో అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఎట్టకేలకు పోటీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా డీవై పటేల్ టీ20 కప్తోనే రీఎంట్రీ ఇచ్చాడు. రిలయన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.