
కొలంబో: ప్రేమదాస మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలోనే ఛేదించింది. శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1X6) ఆడగా.. సూర్యకుమార్ యాదవ్ (31 నాటౌట్; 20 బంతుల్లో 5x4) చివరి వరకు క్రీజులో నిలిచి తొలి విజయాన్ని అందించాడు. అంతకుముందు యువ ఓపెనర్ పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4) మెరుపులు మెరిపించగా.. ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8x4, 2x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. లంక బౌలర్లలో ధనుంజయ డి సిల్వ రెండు వికెట్లు తీయగా.. లక్షన్ సందకన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే మైదానంలో మంగళవారం రెండో వన్డే జరగనుంది.
శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు మంచి శుభారంభం లభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్తో కలిసి ఆరంభించిన యువ ఓపెనర్ పృథ్వీ షా వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి చుక్కలు చూపించాడు. షా క్రీజులో ఉన్నంతసేపు వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఓ సమయంలో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. అతడి దెబ్బకు 5 ఓవర్లలోనే స్కోరు 55 పరుగులు దాటింది. 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షా.. 9 ఫోర్లతో 43 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ధనంజయ వేసిన 5.3 ఓవర్కు భారీ షాట్ ఆడబోయి అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్, ఫోర్గా మలిచాడు. కిషన్ కూడా హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. అయితే శిఖర్ ధావన్ మాత్రం నెమ్మదిగా ఆడాడు. మరింత చెలరేగిన ఇషాన్ శ్రీలంక బౌలర్లతో చెడుగుడు ఆడాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో ఇషాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే ఫార్మాట్లలోనూ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు నెలకొల్పాడు. అయితే శతకొట్టేలా కనిపించిన కిషన్ సందకన్ బౌలింగ్లో భానుకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 85 పరుగులు జోడించారు.
ఇషాన్ ఔట్ అనంతరం మనీశ్ పాండే (26; 40 బంతుల్లో 1x4, 1x6) క్రీజులోకి రాగా నెమ్మదిగా ఆడాడు. ధావన్తో కలిసి లంక బౌలర్లను కాచుకున్నాడు. మూడో వికెట్కు వీరిద్దరూ 72 పరుగుల మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గబ్బర్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అయితే జట్టు స్కోర్ 215 పరుగుల వద్ద మనీశ్ ఆడిన షాట్ను షనక క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే భారత్ విజయం ఖాయం కాగా.. సూర్యకుమార్ వచ్చి మిగతా పనిపూర్తి చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో టెయిలెండర్లు కరుణరత్నె (43 నాటౌట్; 35 బంతుల్లో 1x4, 2x6), చమీరా (13; 7 బంతుల్లో 1x4, 1x6) ధాటిగా ఆడి లంక జట్టుకు భారీ స్కోర్ అందించారు. కెప్టెన్ దాసున్ షనక (39; 50 బంతుల్లో 2x4, 1x6), అసలంక (38; 65 బంతుల్లో 1x4) నిలకడగా ఆడి ఐదో వికెట్కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2x4, 1x6), మినోద్ భానుక (27; 44 బంతుల్లో 3x4) మంచి శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లలో యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చహర్ తలో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.