Ishan Kishan: ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు రంజీల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జార్ఖండ్ తరఫున ఆడబోతోన్నాడు. ఈ ఏడాది జార్ఖండ్ తరఫున రంజీ టోర్నమెంట్లను ఆడబోయే 25 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. ఈ మేరకు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
నిజానికి- రంజీలకు దూరంగా ఉండాలని గతంలో ఇషాన్ కిషన్ భావించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్కు మాత్రమే అందుబాటులో ఉండాలని గతంలో నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం కాస్తా అతని తిరోగమనానికి కారణమైంది. ఈ మధ్యకాలంలో జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.

గత ఏడాది నవంబర్ తరువాత అంతర్జాతీయ మ్యాచ్లేవీ అతను ఆడట్లేదు. గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడిన భారత జట్టులో సభ్యుడు కూడా. ఆ తరువాత కనుమరుగు అయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్కూ ఎంపిక కాలేదు. జాతీయ సెలెక్టర్లు, బీసీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ గత సీజన్లో రంజీల్లో ఆడటానికి ఆసక్తి చూపలేదు.
రంజీల్లో ఆడకపోవడం వల్ల ఇషాన్ కిషన్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. రంజీల్లో ఆడితేనే ఇషాన్ కిషన్కు ఆ తరువాత అవకాశాలను ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆరంభం అయ్యే దులీప్ ట్రోఫీ సీజన్కు కూడా అతని పేరును పరిగణనలోకి తీసుకోలేదు
ఇషాన్ కిషన్ తరహాలోనే రంజీలను ఆడనంటూ మొండికేసిన శ్రేయాస్ అయ్యర్.. ఆ తరువాత తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి వచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతనిపైనా వేటు వేసింది. దీనితో శ్రేయాస్ అయ్యర్ ముంబై తరపున కొన్ని మ్యాచ్లో ఆడటంతో కాంట్రాక్ట్ను రెన్యూవల్ చేసింది.
అదే తరహాలో ఇషాన్కు కూడా రంజీల్లో ఆడితేనే సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించడం, జాతీయ జట్టులో అవకాశాల కోసం పేరును పరిగణనలోకి తీసుకుంటామంటూ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. దీనితో అతను మెట్టుదిగాడు. జార్ఖండ్ తరఫున రంజీలను ఆడబోతున్నాడు.